Wednesday, March 30, 2011

నయ్యర్ గారూ, ఇది మీకు సబబేనా?


ఆంధ్ర జ్యోతి, ౩౧ మార్చ్ ౨౦౦౧

Saturday, March 26, 2011

విగ్రహాలు ఎందుకు కూలాయి?







ఆ సంఘటన అందరి హృదయాల్ని కలచి వేసింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసిన అవకాశాలు ప్రజలకంటే పాలకులకే ఎక్కువగా ఉన్నాయి. కానీ దాన్ని కూడా వదులుకుంటున్నారు. ఇలా జనం చీమల్లా ట్యాంక్‌బండ్ మీదకు కదలిరావటం ఇదే మొదటిసారి కాదు. ప్రతి బతుకమ్మ పండుగకు, వినాయక నిమజ్జనం సమయంలో ఆబాల గోపాలం కదలి ట్యాంక్‌బండ్ మీదకు రావడం జరిగేదే. కానీ, ఆ సందర్భంలో మాత్రం ఆ జనం మొఖాలపై నవ్వులు, కేరింతలు, ఉత్సాహాలు చూసేవాళ్లం. పోలీసులు కూడా కనపడేవారు. కానీ వారు లాఠీలను చూసి మురిసి పోయిందానికన్నా ప్రజల మధ్యన ఉండి, ప్రజల సంతోషాలతో లీనమౌతూ, తాము కూడా ఉన్నామని ప్రజలకు చెబుతూ ఉండేవారు. ప్రజలు ఈ 25 ఏళ్ల కాలంలో ట్యాంక్‌బండ్‌పై ఒక్క విగ్రహాన్ని కూడా ముట్టుకోలేదు. అది హైదరాబాద్ ప్రజల సంప్రదాయాన్ని, సహనాన్ని, నాగరికతను ప్రతిఫలించింది.

అకస్మాత్తుగా మిలియన్ మార్చ్ ఎందుకు ప్రజల ఆలోచనల్ని మార్చింది? సంతోషాలకు బదులుగా ఆ సమయంలో కక్షలు ఎందుకు రేగాయి? ప్రజల మనోభావాల్లో ఎందుకు ఈ మార్పు వచ్చింది? దీని వెనుక ‘రాజముద్ర’ కనపడుతున్నది. ప్రజలను ట్యాంక్‌బండ్‌కు రానివ్వకూడదని, జేఏసీ ఇచ్చిన పిలుపును విచ్ఛిన్నం చేయాలని, తెలంగాణ ప్రజల మనోభావాలు కనపడ కుండా చేయాలన్న ఎత్తుగడ పాలకులది. కేంద్రం మన్ననలను పొందాలన్న తహతహ రాష్ట్ర ప్రభు త్వానికి ఉంది. చిదంబరం మెప్పు పొంది అధికార పీఠంలో మరో మెట్టు ఎక్కా లన్న తపన ప్రభుత్వంలో ఉన్నట్లుగా కనిపించింది.

మార్చి 10వ తేదీన పిల్లల పరీక్షను తమ బలంతో రాయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రజాబలంకన్నా అధికార బలం ఎక్కువని నిరూపించాలనుకున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు అధికారంతో నడవవు. పోలీసుల పహారాలో పాలన ఎంతకాలమో సాగదు.

ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల ఆకాంక్షను కాదనలేదు. ఈనాడు ప్రజలు తమ పిల్లలు చదువుకోవాలని, తమ పిల్లలు మానవ సంపదగా తయారు కావాలని, తమ ఆర్థిక ఎదుగుదలకు చేయూత నివ్వాలని ప్రజలు కాంక్షిస్తున్నారు. దాన్ని గమనించే బహుశా టీఆర్‌ఎస్, జేఏసీ తమ కార్యక్రమంలో మార్పులు చేసుకుని పిల్లల పరీక్షలకు అవకాశం కూడా కల్పించడం జరిగింది.

ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఉద్యమం చేసే నిర్వాహకులు ఒప్పుకున్నారు. పిల్లల్లో టెన్షన్ తగ్గిందని ఆనందించాను. ఇంటికొచ్చే సరికి టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన వందల మందిని అరెస్టు చేశారని చెప్పారు. నన్ను ఎందుకు మాట్లాడరని కొందరు అడిగారు. సహనం వహించండి! అరెస్టులు చేయరని చెప్పాను.

9వ తేదీ రాత్రి నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాను. రాత్రి 12 గంటల సమయంలో అడుగడుగునా తనిఖీలు చేయటం కళ్లారా చూశాను. అది ఒక్కచోటనే కాదు, పదిచోట్ల నా కారును నిలువెల్లా సోదా చేయడం జరిగింది. నా కారునే కాదు మొత్తం తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

తెల్లవారగానే మార్చి 10న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వాకింగ్‌కు వెళ్లాను. పరీక్షల రోజున కూడా విశ్వవిద్యాలయం చుట్టూ అవే ముళ్లకంచెలున్నాయి. పరీక్షలు సాఫీగా జరగాలని పిల్లల్లో భయోత్పాతం పోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ భయంకర పరిస్థితి తప్పలేదు. ఇంటర్ పిల్లలు ఎన్నో ఇబ్బందులుపడ్డారు. కొందరు ఇంటర్ పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులను కూడా అనుమతించడం లేదని కొందరు ఫోన్లు చేశారు. ఏది కాకూడదని తలచానో అదే జరిగింది. పిల్లలు పరీక్ష రాశారు. కానీ 10 వేల పైచిలుకు విద్యార్థులు పరీక్ష రాయలేక పోయారు. పరీక్షకు ఒత్తిళ్లమధ్య హాజరైన విద్యార్థి ఏం రాయగలుగుతారో నాకు తెలుసు. ఏదో పరీక్షలు జరిపామని ప్రభుత్వానికి సంతోషమా? జేఏసీ, టీఆర్‌ఎస్ ప్రోగ్రాంలను జరగనీయకుండా ఆపగలిగామని అహంభావమా? పరీక్షలు ఎవరి కోసం? ప్రభుత్వ గౌరవం కోసమా? పిల్లల భవిష్యత్తుకా? పిల్లలు పరీక్షలు రాసి వచ్చామన్న సంతోషాన్ని చూడాలా? లేక పోలీసుల ప్రవర్తనతో వారి మొఖాల మీద అసహనం చూడాలా?

ఇంటర్ పరీక్ష అయిపోయింది. మధ్నాహ్నం 1 గంట నుంచి ట్యాంక్‌బండ్‌పై రెండవ అధ్యాయం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధన పరీక్ష మొదలైంది. ఆ సమయంలో నేనప్పుడు ఒక నవోదయ స్కూల్లో ఉన్నాను. పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి! ఎంత ప్రశాంతంగా ఉండాలో వారికి చెబుతున్నాను. ఇంకోపక్క పిల్లలు పరుగెత్తుకుంటూ ట్యాంక్ బండ్ వైపుకు వస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ప్రదర్శనలు జరుగు తున్నాయి. ప్రదర్శనలు చూసి తల్లిదండ్రుల సాయంతో ట్యాంక్‌బండ్ ఎక్కారు. పిల్లలు జమగూడితే వారి వెంబడి నడిచాను. ఒక్కొక్కరూ తమ బాధలను చెప్పుకుంటున్నారు. అవి వినుకుంటూ వారిని సముదా యించుకుంటూ ట్యాంక్‌బండ్‌పై ఆ మూల నుంచి ఈ మూలకు తిరిగాను. ఒక విద్యార్థి ఆత్మహత్యాప్రయత్నం చేసుకున్నాడని ఆ లేఖను చూపించి కొందరు విలపించారు.

విద్యార్థులను ఏం అనకండని పోలీసులను వేడుకున్నాను. దాని తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికొచ్చి టీవీ చూశాక మనస్తాపం చెందాను. ప్రజలకు, రాజకీయ పార్టీలకు మధ్య అగాధం ఏర్పడిందని అనిపించింది. రాజకీయ పార్టీలు విధినిర్వహణలో విఫలమయ్యాయి. అవి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ పౌరజీవనాన్ని కాపాడాలి. ఇలాంటి సంఘటనల నుంచి, ఇలాంటి క్షేత్రాల నుంచి రాజకీయ పార్టీలను దూరంగా ఉంచితే ఏం జరుగుతుందో అదే జరిగింది. ప్రభుత్వం డీజీపీతో సంప్రదించేకన్నా రాజకీయ పార్టీలతో సంప్రదిస్తే బాగుండేది. రాజకీయ పార్టీలు పౌరజీవనాన్ని కాపాడగలుగుతాయి. దానికి ప్రత్యామ్నాయం పోలీసులు కాదని ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘటనలు మరొకసారి తేల్చిచెప్పాయి. ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవటం కోసం భావితరానికి స్వేచ్ఛా వాతావరణం కల్పించటం కోసం ట్యాంక్ బండ్ సంఘటనపైన ఒక సమగ్ర విచారణ జరిపించండని కోరుతున్నాను. ఇది దోషులను పట్టుకోవడం కోసం కాదు ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడటం కోసం ఆ పని చేయాలి. ఆ విగ్రహాలను పడగొట్టింది కొందరు వ్యక్తులు మాత్రమే. వారు కావాలని వాటిని పడగొట్టలేదు.

ప్రజాస్వామిక భావాలను చెదరగొట్టింది ప్రభుత్వమే. చెదిరి పోయిన ఆలోచనల నుంచి తలెత్తే ఆగ్రహానికి ఎవరూ ఎదురు నిలవలేరు. సహనం బద్దలైతే సంభవించేది ఉపద్రవాలే. సరిగ్గా అదే జరిగింది. ఇందుకు మూలాలు ఇకనైనా ఆలోచిస్తారా?

చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు
Sakshi Daily 26th March 2011.

నిగ్రహం ఆగ్రహమైన వేళ !

కూలిన విగ్రహాలను చూసి ఆగ్రహంతో శివాలూగుతున్న సీమాంధ్ర నాయకులుగానీ, సాహిత్యకారులుగానీ 55 ఏండ్ల నుంచి ఏడుస్తున్న ‘తెలంగాణ తల్లి’ కన్నీళ్లు తుడిసిండ్రా అని అడుగుతున్నం. నోరులేని విగ్రహాలు ఏంజేసినయని అమాయకంగా అడుగుతున్నరు. ఆ విగ్రహాలేంజెయ్యలే. మా స్ఫూర్తి ప్రదాతలుండాల్సిన స్థలాన్ని కబ్జాచేసిండ్రు. ఖాళీ చేస్తలేరు. ఇది సాంస్కృతిక విషాదం అని వగచేముందు, ఆరు వందల మంది తెలంగాణ బిడ్డలు పాణాల్తీసుకున్నా ఎందుకు కనికరం చూపలేదన్నది గుర్తు చేసుకోవాలి. మరికొందరు చీకటిరోజు అంటున్నరు. అరవై ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు చీకట్లనే బతుకుతున్నరు. అయినా అదెన్నడు ఆళ్లకు కనబడలే.

శ్రీకాంతాచారి, యాదయ్య, వేణుగోపాలరెడ్డి, పోలీసు కిష్టయ్య సహా వందల సంఖ్యలో తెలంగాణ బిడ్డలు బతుకులు బలిపెడితే సంతాపం కూడా ప్రకటించలేదు. ఇది ‘దుర్మార్గ చర్య’ అంటూ రాష్ట్ర మంత్రులు మూకుమ్మడిగా ప్రకటన చేస్తరు! హైదరాబాద్ గల్లిగల్లిల ఇనుప కంచెలు, బార్బ్‌డ్ వైర్లతో రోడ్లన్నీ అష్ట దిగ్బంధం చేసి అడ్డుకోవడం దుర్మార్గ చర్య కాదా? నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలన్నింటిని మిలటరీకి అప్పచెప్పి, బార్డర్లో మాదిరిగా కాపలా కాయించి కనీసం ద్విచక్ర వాహనాలు కూడా కదలకుండా చేయడం దుర్మార్గం కాదా?
విగ్రహ విధ్వంసం తెలంగాణవాదుల మూర్ఖత్వానికి నిదర్శనం అని సీమాంధ్రులు గగ్గోలు పెడుతుండ్రు! ఇచ్చిన మాటకు కట్టుబడకుండా, తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైతదని ప్రకటించిన 24 గంటల్లోనే రాజీనామా డ్రామాలతో అలజడి సృష్టించి నోటికాడి బుక్కని కాలదన్నింది ఎవరు? ఇన్నిచేసి, ఇప్పుడు ఉద్యమంలో హింస చోటుచేసుకుందని వగల ఏడుపు ఏడుస్తుండ్రు! 2009 డిసెంబర్ 9 నుంచి 23 వరకూ సీమాంధ్రలో తగలబెట్టిన దాంతో పోలిస్తే, తెలంగాణలో జరుగుతున్నది లెక్కలోకే రాదు.

తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేకుండా, కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టుకుండ్రు. మరి తెలంగాణ కోసం కొసదనుక కొట్లాడిన జమలాపురం కేశవరావు, కొమురం భీం విగ్రహాలు ఎందుకు లేవు? ప్రథమాంధ్ర సంస్కర్త కందుకూరి వీరేశలింగం అంటరు! ఆయన్ని మించిన ప్రథమ సంస్కర్త వనపర్తి రాజేశ్వరరావు అని, ఆధారాలతో సహా సురవరం ప్రతాపరెడ్డి నిరూపించిండు. ఆయన ప్రతిమ ఎందుకు లేదు? మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ రాసి, తెలుగు భాషకు హారాన్ని అందించిన పొన్నగంటి తెలగనార్యునికి ట్యాంక్‌బండ్‌పై తావెందుకు లేదు? ‘భాష’ను దేశీ మార్గం పట్టించి, సామాన్యుల ‘సంభాషణ’లకు కావ్యగౌరవం కల్పించిన పాల్కురికి సోమనాథుడు ఎక్కడా కనిపించడెందుకు? సీమాం ధ్రుడు సీఆర్ రెడ్డికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విశ్వవ్యాప్త కీర్తి తీసుకొచ్చిన వైస్‌చాన్సలర్ అలీ యావర్‌జంగ్‌ని ఎందుకు విస్మరించిండ్రు?

తెలంగాణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన టీఎన్ సదాలక్ష్మి, జే ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయి, సుగ్రా హుమాయూన్ మీర్జా, చాకలి ఐలమ్మ, మహాలఖా బాయిల విగ్రహాలు ఎక్కడని ప్రశ్నిస్తున్నం. నాటి ప్రభువులను గడగడలాడించిన తెలంగాణ రాబిన్‌హుడ్ సర్వాయి పాపన్న, తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి ప్రాణమిచ్చిన దొడ్డి కొమరయ్య, బ్రిటిష్ రెసిడెన్సీపై ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన తుర్రెబాజ్‌ఖాన్, గాయాల్ని గేయాలుగా మార్చిన సుద్దాల హనుమంతు, తెలంగాణ ఆర్తికి ప్రతీకలు కొత్వాలు వెంకటరామారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య, రావి నారాయణరెడ్డి, బత్తిని మొగిలయ్యగౌడ్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డివంటి వారిని సీమాంధ్రుల పాలన పూర్తిగా విస్మరించింది. వారిని స్మరించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

అన్ని రంగాలకు చెందిన సీమాంధ్రులంతా ఒక్కటై, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కంకణం కట్టుకున్నరు. అందుకే, తెలంగాణ ఉద్యమంలోకి నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డారని దుష్ర్పచారం చేస్తున్నరు. నిజానికి ‘మిలియన్ మార్చ్’ను శాంతియుతంగా జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చివుంటే, ప్రజల్లో భావోద్వేగాలు తీవ్రమయ్యేవి కావు. అనుమతి నిరాకరించిన ఫలితంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుని విగ్రహాల విధ్వంసానికి తోవతీసింది. ప్రణాళికాబద్ధంగా విగ్రహాల కూల్చివేత సాగివుంటే, 1969 ఉద్యమంలో 369 మందిని బలితీసుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం మిగిలేదా?

సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ హిస్టరీ సొసైటీ
Sakshi Daily, 26th March 2011.

Tuesday, June 16, 2009

గాయపడిన తెలంగాణ



నిజమే. తెలంగాణ గుండె గాయపడింది. క్షతగాత్ర తెలంగాణ. మరోసారి నిలువునా మోసపోయిన తెలంగాణ. ఇంటి మనుషులు, పరాయి మనుషులతో రెండందాలా దగాపడింది తెలంగాణ. కకావికలై, ఛిద్రుపలైన గుండె గాయం పాతది. అది మాననిది. ఇప్పుడిక ఏలిక పూర్తి విద్వేషంతో, పూర్తి అసహనంతో, ఏమీ దాచుకోకుండానే ప్రకటించా డు.



అవునూ.. 'ఏమనుకుంటున్నారు మమ్మల్ని'.. 'మేము'గా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి దాచుకున్నదేమీ లేదు. ఆయన కోస్తాంధ్ర, రాయలసీమ రియల్టర్ల, పెత్తందార్ల, పెట్టుబడిదారు ల ప్రతినిధిగా అహంకారాన్ని ప్రదర్శించడంలో కొత్తలేదు. వింతకూడా లేదు. తెలంగాణ ఆత్మమీద చివరాఖరి దెబ్బకొట్టడంలో ఏలిక విపరీతమైన ప్రాంతీయ దురభిమానమూ ప్రకటించడంలో ఆశ్చర్యమూలేదు. అంతా ఖుల్లమ్‌ఖుల్లా. ఉన్నదున్నట్టే. దాచుకున్నదీ లేదు. మరుగునపరిచిందీ లేదు. ఆ మాట కొస్తే ఏ మాటలు చెప్పి అయిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చా రో? ఆ మాటలు మింగాల్సిన పనికూడా లేదు.



తెలంగాణ ఆత్మాభిమానం గురించీ, తెలంగాణకు దక్కనివాటి గురించి, దక్కాల్సిన వాటి గురించి, తెలంగాణకు తరతరాలుగా అంతర్గత వలస ఆధిపత్యం వల్ల జరుగుతున్న అన్యాయాల గురించీ, సహేతుకంగా, స్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతున్న, మాట్లాడాలనుకుంటున్న, వీధులకు ఎక్కాలనుకుంటున్న, ఉద్యమించాలనుకుంటున్న అచ్చ తెలంగాణవాదులందరికీ శాసనసభ సాక్షిగా వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక స్పష్టమైన, సూటిగా ఉన్న సందేశం పంపించారు.



బహుశా అది తెలంగాణవాదులకు ఒక హెచ్చరిక. భయం పుట్టడానికి అది ఒక ముందు సూచిక. ఇక ముందు తెలంగా ణ, గిలంగాణ జాన్తానై. నేనే తెలంగాణ. తెలంగాణ నావెంట ఉంది అన్నారు వై.ఎస్ అదీ విషాదం. ఎవరైతే తెలంగాణను మాయజేసి, మోసంజేసి అయిదేండ్ల కిందట అధికారంలోకి రావడానికి ఒక పావుగా వాడుకున్నారో? ఎవరైతే మలి తెలంగాణ పోరాటానికి తుది పరిష్కారంగా తెలంగాణ కనుచూపుమేరలో కనబడ్తుందన్న ఆశలు రేపారో? ఎవరైతే తెలంగాణ మాటను అనీ అనకుండా, కనీ కనపడకుండా, వినీవినపడకుండా ఉచ్ఛరించి, తెలంగాణ ఓట్లతో అధికారంలోకి వచ్చారో ఆయన.



ఆ తర్వాత అదే తెలంగాణ ఆకాంక్షలపై అడుగులేసి తొక్కుకుంటూ, తోసుకుంటూ ఉల్టా బనాయించారో ఆయన ఇవ్వాల్టి తెలంగాణకు పెద్దదిక్కు కావడం మరీ విషాదం. ఎందువల్ల? తెలంగాణ ఆకాంక్షలను, ఉవ్వెత్తున లేచినిలబడిన ఆశల మోసులను అణగార్చిందెవరు? తెలంగాణను మళ్లీ ఒకసారి అంగడి సరుకుగా అమ్ముకుని త్యాగాల పునాదుల మీద స్వార్థాల బిల్డింగులు కట్టుకున్నదెవరు? జీవన్మరణ సమస్యలను, ఉద్వేగాలను, త్యాగాల వారసత్వాన్ని, నెత్తురునూ, కలికలి మనసులు పడిన దుఃఖపు కన్నీళ్లను అమ్ముకున్నదెవ రు? వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి అట్లా ఉండకుంటే ఆశ్చర్యపోవాలి. అయినా కొత్తేమీ లేదు.



సిగ్గులేకుండా, కించిత్ ఆత్మాభిమా నం లేకుండా చెప్పుకింద నలిగిన వాళ్లలా గా, బానిసల్లాగా, వెన్నెముకలు లేని వానపాములలాగా కనీస అభిజాత్యం లేని, కనీసం స్పృహలేని ఒక వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచర మంద గురించీ, మంత్రుల గురించీ, ఎమ్మెల్యేల గురించీ మాట్లాడడం లేదు. కానీ,..వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ పట్ల ద్వేషం వెళ్లగక్కడం, తెలంగాణకు అడ్డంపొడుగూ నిలబడి అడ్డుకోవడం, కాలికేస్తే మెడకేయడం, రక్తాలు పారిస్తానని చెప్పించడం, ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగి 'మేము ఎట్లా కనపడ్తున్నామనడంలో కొత్తేమీ లేదు.



నిజానికి వై.ఎస్. అట్లా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ.. ఉధృతంగా, ఉవ్వెత్తున లేచిన తెలంగాణ మలిపోరాటాన్ని ఇంతటి క్షతగాత్ర చేసిందెవరు? మూడువందలా డెబ్భైమంది ప్రాణాలను అర్పించిన వీరు ల త్యాగాల ఫలితాన్ని అలనాడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి బంగారు పళ్లెంలో పెట్టి ఇందిరాగాంధీ పాదాల చెంతపెట్టా డు. నిజమే చెన్నారెడ్డి స్వయంగా తెలంగాణ ద్రోహిగా బదనా మ్ అయ్యారు. అది ఆయనకే పరిమితమయింది.


కానీ, మోసా లు చవిచూసీ చూసీ, ఒక్క ఒప్పందమూ అమలుగాక, రాసుకున్న ఒక్క సూత్రమూ పాటించక, తెలంగాణ వనరుల దోపిడి ఒక్కటీ ఆగక, ఉల్టా ఉనికికి, సంస్కృతికీ, భాషకు, యాసకు కూడా గడ్డురోజులొచ్చిన వివక్షారూపాల పరాకాష్ట నుంచి బుద్ధి జీవుల శ్రమ నుంచి లేచి నిలబడింది మలి తెలంగా ణ. చీమలు పుట్టలు పెట్టాయి. రెండో ఉద్యమంలో పామెట్లా చొరబారింది. ఆరెండు తలల పాము తెలంగాణ మలి ఉద్యమాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేసింది.



అది తన స్వార్థ ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం, దొర పోకడల కోసం, తన చిత్త చాపల్యాల కోసం, నోటి తో నిప్పులు కక్కే మాటలు చెబుతూ, నొసటితో తెలంగాణ ప్రజల భవిష్యత్తును వెక్కిరిస్తూ...తెలంగాణ ఉద్యమంమీద ఒక బలహీనతను చిమ్మింది. అదీ తేడా. రెండో విడత మోసకారి ఇప్పటికీ ఒక ఉద్యమకారుడు. ఇప్పటికీ అతను తలదీసి మొలేసే మొనగాడు.



ఇప్పటికీ అత ను తెలంగాణ మంత్రాలు వల్లించే మాయల మరాఠీ మంత్రకాడు. ఇప్పుడు మోసగాడు మరోరూపంలో తెలంగాణ గుండెకు గాయం చేసినాడు. ఏ మోసాల వల్ల తెలంగాణ అలనాడు క్షతగాత్ర అయిందో? అదే మోసం వల్ల ఇవ్వాళ్ల తెలంగాణ నడివీధిలో విద్వేషాలను, తిట్లనూ, దూషణలను భరి స్తూ దీనయై నిలుచున్నది. ఎవరిచ్చారీ సావకాశం.



నలభై ఏండ్ల తర్వాత చరిత్ర విషాదాంతంగానూ, వైఫల్యంగానూ ఎందుకు నిలబడింది. ఇప్పుడిక మొత్తం తెలంగాణను తాకట్టుపెట్టి ఇలాంటి అచేతన స్థితికి తెచ్చిన ఒక నాయకుడి గురించి మాట్లాడండి. శషభిషలు వద్దు. తెలంగాణ అంటే అతనికొచ్చిన పది సీట్లేనా? తెలంగాణ అంటే అతను వాగే నాలుగు మాటలేనా? తెలంగాణ అంటే అతను, అతను ప్రోది చేసిన అచేతన, అడుగు కదలని సిద్ధాంతాలేనా?



తెలంగాణ అంటే కాళ్లూపుకుంటూ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటూ, మైకుల ముందు వీరాలాపనలు, ప్రేలాపనలు చేస్తూ, బేరాలాడుతూ, సుఖభోగాలు, లాలసలు, అనుభవిస్తూ, కుటుంబా న్ని పెంచి పోషిస్తూ, ఇంత ఉద్వేగపూరితమైన అంశాన్ని తాకట్టుపెట్టిన ఆ నేత కాదా కారణం. ఇప్పుడిక తెలంగాణవాదాన్ని అమ్మి, అచేతనం చేసిన ఆ నేతను చరిత్ర చెత్తబుట్టలోకి విసరండి.



నిజమే తెలంగాణ గుండెగాయపడింది. అయితే అది రెండు విధాలుగా కోస్తాంధ్ర, రాయలసీమ పెత్తందారుల ప్రతినిధిగా 'మేము' అని ప్రకటించుకున్న ఒక ముఖ్యమంత్రి అంద రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలవల్ల ఆయనకు గొడుగు పడ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్లనూ మరోవైపు తెలంగాణను అమ్ముకుంటున్న ఒక నయవంచన నాయకత్వం వల ్లనూ... అవును తెలంగాణ గుండెగాయపడింది.



ఇది ఇంతటి తో ముగుస్తుంది? కానీ తెలంగాణ గుండెకయిన గాయం మాటో? అది ఎట్లా రేగుతుందో? ఎవరు చెప్పగలరు. మిస్టర్ చీఫ్ మినిస్టర్... మీరు మాకు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అవునా? కాదా? ఇది ఒక తీరని సందేహం.


- అల్లం నారాయణ

Thursday, June 04, 2009

ఆదాబ్ హైదరాబాద్ - లోచన్‌


ఎంతైనా నువ్వు గ్రేట్‌

నీ విజన్‌ గ్రేట్‌

హైద్రాబాద్‌ చుట్టూ అల్లుకున్న నీ అభిమానం గ్రేట్‌

మరి ఇప్పుడు నీ విదేశీగానంలో ఎన్ని గణాంకాలో

హైద్రాబాద్‌ అదబ్‌నీ

ఆత్మీయ హస్తాన్నీ అందుకోలేకపోయావ్‌

ఈ రంగుల గుల్‌దస్తాలో యిమడలేకపోయావ్‌

బాగె ఆమ్‌ పూలవనంలో పురుగులు చొరబడ్డాయా?

ఇక్కడి ఆబెహవాలో ఇంత కాలుష్యమెప్పుడూ లేదు

విశ్వాసం నిండిన యిక్కడి గాలిలో

విదేశీ బక్వాస్‌ నింపకు

అమ్మపాలు అమృతమౌతాయని తెలుసు

విషమై ద్వేషమై కుదరనిరోగమౌతుందని ఎవరికి తెలుసు?

ద్వేషం నాష్తా అయిన వాడికి

దోస్తానా రుచి ఏం తెలుసు

ఇక్కడి ఒక్క ఇరానీచాయ్‌ చుట్టూ

ఎన్ని స్నేహ సౌరభాలు

ఒక్క బిర్యానీ మనసునిండా

ఎంత బిరాదరీ ఘుమఘుమలు

ఆకాశం గుండెలు తాకే ఖవ్వాలీ

లుకమనీయ కవితా సాయంత్రాలూ..

షామె గజల్లూ.. భజనలూ

భాయీచారాలూ..

వేదనలు వైరుధ్యాలెన్నున్నా

అనుబంధాల నగరం హైద్రాబాద్‌

రంగుల హరివిల్లు యీ యిల్లు

మక్దూమ్‌ మల్లెపందిరి కింద

మంట పెట్టేవాడికి

మనసు మమకారాల

మాటేమి తెలుసు?

ఇక్కడి జీవధారలు

తరలించుకు పోయిన పైరేట్లెవ్వరు?

సహజ సంపన్న తెలంగాణ తల్లిని

చింపిరి గుడ్డల్లో నిలిపిన

వంచనా శిల్పులెవరు?

ప్రాణాన్ని మించిన

ఆమె అభిమానాన్ని అవహేళన చేసిందెవ్వరు?

నీవు తిన్నింటి వాసాలు లెక్కపెట్టవు

తగల బెడతావుద్వేషమే మాకు విదేశీయం

దోపిడీ యిక్కడ బహిషారం

ఇంకా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల కాళ్ల కింద నలగని

ఈ గరీబ్‌ గల్లీల్లో గలత్‌ నడకలు నడవకు..

గందగీ నింపకు

దోస్తానా దారుల్లో వేర్పాటు ముళ్ల కంచెలు నాటకు

మనసున్న నగరమిది

మొహబ్బత్‌కి దునియాఁ యిది

ఇక్కడి చౌరస్తాలో నిలబడి ధృతరాష్ట్రుని చేతులు చాచకు

నువ్వెన్ని గొళ్ళాలు పెట్టినా

ఖులాదిల్‌ కా దర్వాజా మాది

ఆమ్‌ ఆద్మీ ఆత్మీయ సౌందర్యం హైద్రాబాద్‌

వేదనలు వైరుధ్యాలెన్నున్నా

వైవిధ్యాల హరివిల్లు యీ యిల్లు

ఇంత అందమైన ఆత్మీయ నగరంలో

అభివృద్ధికి అందని అన్‌టచెబుల్స్‌ ఎందరో

ఈ కూడళ్ళు ఆకలికళ్ళ నెగళ్ళు

చాచిన హస్తాలు యిక్కడి రస్తాలు

మూసీనది తీరం బురదలో కూరుకుపోతున్న బతుకులు

రాత్రుళ్ళు యీ నగరం ఫుట్‌పాత్‌ల మీద

ఆకలి ఆరేసిన అస్థిపంజరాలు

బడుగుల ప్రత్యేక బలివితర్దులు ఎన్నెన్నో భోలక్‌పూర్‌లు

బడుగు బతుకుల యీ బడబాగ్ని కడుపులో దాచుకుని

బంజారా గుదిబండను మోస్తున్న అమ్మ హైద్రాబాద్‌

అందరి ఆషియానా హైద్రాబాద్‌

అయ్యా! మళ్ళీ చెపుతున్నా

మఖ్దూమ్‌ చల్లని మల్లె పందిరికింద మంట పెట్టకు

తెలంగాణా తగ్దీర్‌తో ఆడుకోకు

తెలంగాణా కోపాన్ని తట్టి లేపకు

ఈ రతనాల వీణ తీగలు తెంచకు

రక్తగీతమై అంతా రాజుకొంటుంది

ఇక్కడ యీ బోనాల వీధుల్లో..

ఈద్‌ ముబారక్‌ ఇఫ్తార్‌ విందుల్లో

భోలాల, దిల్‌ వాలాల మనసుల్లో

వేరు బంధాల బీజాలు నాటకు

తెలంగాణా తెరువుకు రాకు

ఇక్కడి బతుకుల తెర్లు చేయకు

అన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకునే వాడు

అమ్మను కూడా నమ్మడు కదా

అవును - తెలంగాణ తెర్లయింది

దొంగలు పడ్డ యిల్లయింది

తెలంగాణావాడు - నీకు దివానాగాడు

చీల్చడమే తప్ప కూర్చడం రాదు కొందరికి

హైద్రాబాద్‌ అందమంతా

ఆమ్‌ఆద్మీ ఆత్మీయతలో ఉంది

నీ నవ్వుల షార్ప్‌ వెపన్‌తో

అనుబంధాల అంతస్సూత్రాలు తెంచకు

హైద్రాబాద్‌ నీకు అతిపెద్ద ఆర్ధిక మండలి కదా

నీవేమైనా కొనగల వేమో కాని

తెలంగాణకి వెల కట్టలేవు

అబద్ధాల మీద ఆయుధాల మీద బతికేవాడు

అమెరికా వాడైనా అనంతపురం మనిఫైనా

మనిషి రక్తం రుచి మరిగిన వాడే కదా

విదేశీయం ఆహా!

ఇది ఎన్నికల ఎత్తుగడ అని లైట్‌గా తోసేయకు

నీ మనసు కక్కిన నిజమిది

నీ నరాల్లో పారే నైజమిది

ఆదాబ్‌ హైద్రాబాద్‌

అనురాగాల హైద్రాబాద్‌

వేదనలు వైరుధ్యాలెన్నున్నా

అనుబంధాల నగరం హైద్రాబాద్‌

-ఆంధ్రజ్యోతి సౌజన్యంతో

Thursday, May 21, 2009

మేలుకొలుపు ఎప్పుడు తండ్రీ! --అరుణ్‌సాగర్


తండ్రీ మూడున్నర దశాబ్దాలుగా కాపాడుకున్న చెట్టు మోడువారడం రిజిస్టర్ కావడం లేదు. గెలుపో పిలుపో జానేదేవ్. ఇప్పుడు కావాల్సింది మేలుకొలుపు. ఇప్పుడు కావాల్సింది స్వీయసమీక్ష...తండ్రీ నెపం కుట్రల మీద వేసి తప్పుకోకండి. కుట్రలకు లొంగిపోయే పరిస్థితి ఎందుకొచ్చిందో సమీక్షించండి. ప్రలోభాలకు లొంగిపోయేంత బలహీనులు ఎవరి నాయకత్వంలో తయారయ్యారో గుర్తించండి.
నా గుండె నిండా జెండా జ్ఞాపకాలు మోసుకు బతుకుతున్నాను. చెడిపోయిన వాడ్ని అని కోపగించకు. జేగురు రంగులో ముంచినా నా చిట్టి చేతులతో ముర్ల యర్రయ్యరెడ్డికే మీ ఓటు అని గోడమీద రాశాను. కానీ, ముప్ఫై ఏళ్ల పాటు గుండెలకు తగిలించుకున్న విజయపతాకం ఒక్కసారి ఊడిపోయే సరికి కూలిపోయాను. బాధతో కుమిలిపోతున్నాను. తండ్రీ ఇక్కడ ఏం జరుగుతోంది. వన్నాఫ్ సెవెం టీ నుంచి రెండువేల తొమ్మిది వరకూ ఏ గందరగోళం ఏ అలసత్వం ఏ అజ్ఞానం ఏ అహంకారం ఏ కృతజ్ఞతా రాహిత్యం నీ శ్రేణులను ఆవహించింది? ఎవరు ఎవరితో కాంప్రమైజ్ అయ్యారు.
ఏ వీరులు తెరమరుగ య్యారు. ఏ విల్లంబులు విరిగి శిథిలమయ్యాయి. నీ అడవి బిడ్డలు ఆటబొమ్మలై కీలు బొమ్మలై నీవే తెచ్చిపరిచిన మైదాన ప్రాంత పు ఇనుప కార్పెట్ కింద పడి నలిగిపోయారు. ఒకడు చెడిపోయి ఒకడు విసిగిపోయి ఒకడు తెరమరగై ఒకడు విశాలాకాశం వైపు ఆదివాసీ విముక్తి సంస్థవైపు...చివరకు కోయభాష వచ్చినోడే లేకుండా పోయాక లీడరెవరే తండ్రీ. కలప కాంట్రాక్టర్లూ కూపులు వేలం పాడేవాళ్లూ పగ్గాలు పట్టుకున్నాక స్వయం పత్రిపత్తి రుచి చూపే దయామయుడెవడు. నాయకులు పైనుంచి రుద్దబడిన చోటే ఎర్రబడే గుండెలకు జన్మస్థానం ఏదీ.
తండ్రీ క్షమించు విదేశీ కుట్రనూ చెడిపోయినోళ్ల నిర్వాకాలనూ క్షమించు. సమీక్షకు చోటివ్వని చోట నిన్ను శిక్షించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయతలో పడిపోయిన ప్రజలనూ క్షమించు. పాపం వారేమి చేయుచున్నారో వారెరుగరు. తండ్రీ ఇది తొలిజెండా ఎగిరిన చోటు. అడవి హక్కులు, తునికిరేట్లు తప్ప మరేమి కోరని కోయలూ కొండరెడ్లూ నిను నమ్మి నీ వెంట నీ పాట పాడుకుంటూ కవాతు చేసిన నేల. సీధర సీతమ్మా ఇరపా అరుణమ్మా-ఎర్రజెండేరోరన్నా ఎర్రజెండేరా అంటూ గానం చేసిన తన్మయం పొందిన ఆకాశం. రెండు పార్టీలూ కలిసి ఎన్నెన్నో ఉప్పెనలను అధిగమించిన ఘనవారసత్వం.
తండ్రీ నువ్విక ఎంత మాత్రమూ చెడిపోయి న వారి మీద నింద వేయజాలవు. కొంత నిజమో సొంత వాదమో నువ్విక ఎంత మాత్రమూ అమెరికా కుట్రకూ అంతర్గత వైఫల్యానికీ ముడిపెట్టలేవు. చెడిపోయిన వాళ్లందరూ ఎలా చెడిపోయారో ఎందుకు చెడిపోయారో ఏ కాలక్రమంలో చెడిపోయారో ఎవరు చెడగొడితే చెడిపోయారో-అన్నిటికీ మించి ఏ పేరెంటింగ్‌లో చెడిపోయారో చెప్పకుం డా నువ్వు తప్పించుకుపోలేవు. అంతర్గత కుళ్లును కడిగివేయలేనితనం తో అంతర్జాతీయ ఎత్తుగడలను వేలెత్తి చూపి నీ బాధ్యతల నుంచి నువ్వు పారిపోలేవు. నీ దారి నిండా వెలిగే ప్రశ్నల తేజస్సును ఏ అరచేతినీ అడ్డుపెట్టి ఆపలేవు.
అయినప్పటికీ తండ్రీ నిన్ను తప్పుపట్టలేము. బహుశా నీకు కొందరి పేర్లు తెలియకపోవచ్చు. బహుశా నువ్వెప్పుడూ సొరకాయ బుర్రలో గంజి నీళ్ల రుచి చూసి ఉండకపోవచ్చు. బహుశా నీకు కుమ్మూరు నడిబొడ్డున ఓ జెండా దిమ్మకట్టిన వాడితో పరిచయం ఉండి ఉండకపోవచ్చు. బహుశా నీకు మార్త శ్రీరామ్మూర్తీ, భీమయ్యా, తమ్మయ్యా, గుండు ప్రసాదూ, ఇరపా శ్రీరాములూ బిఎస్ రామ య్యా వీళ్లెవరి పేర్లూ తెలిసి ఉండకపోవచ్చు. నీకు తెలిసి న చరిత్రంతా ఒకటి రెండు పేర్లచుట్టే తిరిగి ఉండొచ్చు.
భద్రాచలం కాలేజీలో జెండా నీడన వెలుగుపాట పాడుకున్న వారు శబరీ గోదారీ సీలేరు నీళ్లలో పాటలై కలగలిసి గిరిజన గ్రామాల్లో నీ కీర్తనలు చేసి వాటిని ఓట్లుగా మలచి ఎర్రపూల వనాలు సాగుచేసే వారన్న సంగతి గుర్తులేకపోవచ్చు. ఎర్రమందారాల నర్సరీని నిర్లక్ష్యం చేసి నలుగురు కాంట్రాక్టర్ల దయతో ఏసీ రూముల్లో కార్యదర్శి నివేదికలు తయారు చేసిన వైనం నీ దాకా చేరి ఉండకపోవచ్చు. ఒక మృతవీరుని స్మరణకు ప్రజల సొమ్ముకాక వ్యాపారుల చందాని విసిరేసిన వైనం నీకెవరూ చెప్పకపోవచ్చు.
పృ«థక్కరణం-అనగా ఐసోలేషన్. నీ అడవిబిడ్డలు వేరే అండ ఎందుకు చూసుకున్నారన్న బెంగ నీకు ఏనాడూ లేదు. ఏ సామాజిక సముదాయం నీ ఆదర్శాల నీడన సేదతీరాలో ఆ సమూహం మూకుమ్మడిగా నీకు దూరమైన వైనానికి నీ దగ్గర సమాధానం లేదు. సమగ్ర గిరిజానాభివృద్ధి పథకం ప్రభుత్వం చేసే పని. కానీ మహాసభల క్రెడిన్షియల్ రిపోర్టుల్లో దళిత గిరిజనుల సంఖ్యను చూపించి పేపర్లు దులుపుకోవడం ఎవరిపని?-స్వయం సంపత్తి లేని నాయకత్వ బాధ్యతలు ఏ అట్టడుగు వర్గానికి వికాసాన్ని ప్రసాదిస్తాయి. భూమి పుత్రులకు సింహాసన మిచ్చి కోట గుమ్మానికి తాళం వేసుకోవడం, సర్వసైన్యాన్ని గుప్పిటపెట్టుకోవడం ఏ నిర్మాణం, ఏ ఎత్తుగడల పంథా?
నిందించండి తండ్రీ నిందించండి. చెడిపోయిన కొందరూ విడిపోయిన కొందరూ జీవితంలో ఇతర ప్రాధాన్యాలను ఎన్నుకుని కొందరూ వేరు బాటలు ఎంచుకున్నందుకు నిందించండి. కానీ, జీవితం విశాలమైనది. ప్రపంచం బహుముఖమైనది. భిన్నాభిప్రాయంతో సహజీవ నం తప్పదని గుర్తించండి. మూసలు పగులగొట్టండి. సమాజ వికాసా న్ని కాంక్షించడమే ప్రమాణం. వారు లోపలున్నా బయట ఉన్నా నీ బిడ్డలే! ఓట్లు పెద్దగా తరగలేదని సంతోషపడతావో .. ఇన్ని పోరాటాల ఫలితంగా ఏ మాత్రం పెరగనందుకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటావో నీ ఇష్టం! కానీ ..ఓట్ల కంటే పార్టీ ఆస్తులు పెరగటమే ఇక్కడ విప్లవ విషాదం. కానీ తండ్రీ మూడున్నర దశాబ్దాలుగా కాపాడుకున్న చెట్టు మోడువారడం రిజిస్టర్ కావడం లేదు.
గెలుపో పిలుపో జానేదేవ్. ఇప్పుడు కావాల్సింది మేలుకొలుపు. ఇప్పు డు కావాల్సింది స్వీయసమీక్ష. విప్పిన గొంతులను నులిమేయడమే ఈ పరాజయానికీ పరాభవానికీ కారణం. తండ్రీ నెపం కుట్రల మీద వేసి తప్పుకోకండి. కుట్రలకు లొంగిపోయే పరిస్థితి ఎందుకొచ్చిందో సమీక్షించండి. ప్రలోభాలకు లొంగిపోయేంత బలహీనులు ఎవరి నాయకత్వంలో తయారయ్యారో గుర్తించండి. వ్యాధి లక్షణాలను కాదు, శరీరంలో తిష్టవేసిన బ్యాక్టీరియాను తొలిగించండి.
కుట్రలను తిప్పికొట్టలేని వారు నిర్బంధకాండని ఎలా తట్టుకోగలరు? తండ్రీ మీ ఫాదరింగ్ పట్ల అనుమానమే లేదు. మీ చిత్తశుద్ధిపైన సందేహమే లేదు. మేము కోరుకునేది ఒక్కటే. చర్చకు తానివ్వండి. భిన్నాభిప్రాయాన్ని బహిష్కరించకండి. స్వాగతించండి. సమస్యలను నిర్మూలించకండి. పరిష్కరించండి. తండ్రీ వెనక్కు తిరిగి చూసుకోవడానికి నిరాకరించిన వైనమే స్థూలంగా ఈ అపజయానికి మూలం. అప్పుడప్పుడూ అంతశ్శోధన జరిపితే ఇక పట్టదు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన ఖర్మ.
(మూడున్నర దశాబ్దాల తర్వాత భద్రాచలంలో సిపిఎం తొలిసారి ఓడిపోయింది)
* * * * * * *
(ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన కూడ ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. వందలాది మంది మెధావులు వేలాదిగా విద్యార్థులు ప్రచారమ లో ముందున్నా ఫలితాలు అంతంతమాత్రం గా ఉండడం, 400 మంది విద్యార్థి అమరుల త్యాగాలను ఒక రాజకీయ పార్టీ తన బలహీనతల కారణంగా నిర్వీర్యం చేసిందనే బాదతో ఇది ఇక్కడ ఉంచుతున్నా. కమ్యునిస్టు ఉద్యమ సానుభూతి పరుడైన సోదరుడు అరుణ్ సాగర్ కు ధన్యవాదాలు -నవీన్ ఆచారి )

Tuesday, December 30, 2008

మరణవాంగ్మూలం

ఆకాశం భూమీ కలిసే పూట శబరీ గోదారీ కలిసేచోట
సంజెరంగుల్లో కమ్ముకున్న
విషాదపు జీర
చరమాంకంలో ఒకానొక గ్రామం
ఆ పక్కన
శిధిలమైన కొయ్య పడవ
కన్నతల్లి ముందు మోకరిల్లి
మరణవాంగ్మూలం వింటున్నాను
నది అలలపై ప్రతిబింబం
తలారి ముఖంలోని గాంభీర్యం
దూరాన
టూరింగ్ టాకీస్ నుంచి
ఆఖరి సన్నివేశపు ఆవేదన
ఇచ్చోటనే
కొంచెం ఇప్పసారా
కొద్దిగా కొమ్ముబూరా
ఇచ్చోటనే
చలువ పందిళ్లు
పొగాకు బేళ్లు
ఇచ్చోటనే
గలగల ఘల్లుమన్న
రేలారేలా పరవళ్లు
మరియూ ఇచ్చోటనే కదా
ఏడేడు తరాలు
ఎనకటెనకటి పాటలు
అనాది రాగాలు
ఆది పురాణాలు
విల్లంబులు ఎద్దుకొమ్ములు
తునికి చుట్ట పరిమళాల
గుప్పుగుప్పు గాలి గిరికీలు
తరతరాల పాదముద్రలు
హృదయాలు శిలాజాలు
పాయం బొజ్జిగాడు
లాస్ట్ ఆఫ్ ది కోయాస్
పెరిగి పెద్దయి
అలెక్స్ హేలీ అవుతాడా
ఆనకట్ట వెనుక ఆశ్రు జలధిలో
సీతమ్మ ముక్కుపుడక
వెతుకుతాడా
లేక అంతర్ధానపు అంచున వేలాడి
రామా పితికస్ వలె
ఆంత్రోపాలజీ పాఠమవుతాడా
పురాతన జనసమాధి
జన సంస్క­ృతి జల సమాధి
చెరిపేసిన పాటలు
మునిగిపోయిన మానవుని జాడలు
ఊరి మధ్య రావిచెట్టుకు
అమాయకంగా వేలాడుతున్న
కబోది పక్షులు
చివరకు మిగిలినది
ఛాతీ మీద చల్లుకున్న
పిడికెడు నల్లరేగడి
రామయ తండ్రీ
నీ అరణ్యాన్ని
ఆవాసాన్ని ఆవరణాన్ని
లేడి పిల్లల్నీ అడవి బిడ్డల్నీ
నీ పాదాలు ముద్దాడే పాపికొండల్నీ
రేపోమాపో
రెవెన్యూ రికార్డుల నుంచి తొలగిస్తారు
రామా
ఇలా రా
నా పక్కన కూర్చో
నాతో కలిసి
ఈ మట్టి మరణవాంగ్మూలం విను
దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు విను
వినరా విను!
సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు
ఫెట ఫెటేల్ ధ్వానాల్ విను!
వినరా విను!

- అరుణ్‌సాగర్

ఆంధ్రజ్యోతి నుండి..
.

Thursday, December 25, 2008

ఆర్ద హృదయుడు జ్వాలాముఖి - నిఖిలేశ్వర్



'వెళ్తాను సెలవంటూ భౌతికంగా శాశ్వతంగా సెలవు పుచ్చుకు'తూరుపు ఎరుపు హోరు కోసం


నిర్మల నక్షత్రాలై పోరాడండి


వెళ్తాను సెలవు / విజయం మనకు తప్పదు


విప్లవాలు సుదీర్ఘ సాయుధ ప్రయాణాలు


చీకటితో పోరాటం ఆపవద్దు


రాత్రితో రాజీలేక పోవడమే తిరుగుబాటు


ఉజ్వల ఉదయానికి ఎడతెగని పోరాటమే విప్లవం'


(ఆకాశం ఎర్రబడుతూంది)









'వెళ్తాను సెలవంటూ భౌతికంగా శాశ్వతంగా సెలవు పుచ్చుకున్న ఆప్తమిత్రుడు జ్వాలాముఖి నా జ్ఞాపకాల్లో జ్వలిస్తూనే వుంటాడు. మా ఇద్దరి జీవితాలతో- అనేక ఉద్యమాలతో పెనవేసుకున్న మా కవితా యాత్రలో ఎన్నెన్నో మజిలీలు...





జ్వాల తొలి దశలో రచించిన 'మనిషి'ని 1958-59లోనే మేము విన్నాము. ముషీరాబాద్ బస్తీలో నేను నిర్వహించిన 'అభ్యుదయ యువక సంఘం' ప్రతినెలా ఏదో ఒక సామాజిక అంశంపై వక్త ృత్వ పోటీని నిర్వహించేది. నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి యువకులు వచ్చి పాల్గొనేవారు. ఒకసారి సీతారామ్‌బాగ్ నుంచి వచ్చిన ఆకారం వీరవెల్లి రాఘవాచారి మా వేదికపై బల్లగుద్ది మాట్లాడి, తన 'మనిషి' కవిత వినిపించాడు. ఇక ఆనాటి నుంచి మా స్నేహయాత్ర అవిచ్ఛిన్నంగా సాగిపోయింది.





హైదరాబాద్ సాయం కళాశాల (నిజాం కాలేజ్)లో 1959-63 మధ్య మా డిగ్రీ చదువు. నేనూ, నగ్నముని బి.ఏ మొదటి సంవత్సరంలో వుండగా జ్వాల పి.యు.సి.లో వచ్చి చేరాడు. ఆయన రెండో భాష తెలుగు. నేనేమో హిందీ. ముని మాత్రం ఫ్రెంచి భాషలో! కాలేజీలో జరిగే డిబేటింగ్ ముఖ్యంగా తెలుగు శాఖలోని విద్యార్థుల మధ్య వాగ్వివాదాలలో జ్వాలాముఖి అప్పటికే ఆవేశంగా మాట్లాడేవాడు. నేనేమో తడబడుతూ గందరగోళపడిపోయేవాణ్ణి!





ఆ రోజుల్లోనే (1960) నేనూ, జ్వాల సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని ఏ.వో.సి (ఆర్మీ ఆర్డినెన్స్ కోర్) సెంటర్‌లో సి.ఎస్.యమ్ (సివిలియన్ స్కూలు మాస్టర్) ఉద్యోగాలు సంపాదించుకున్నాం. కొత్తగా చేరే ఆర్మీ రిక్రూట్లకు ఇంగ్లీషు-హిందీ జనరల్ నాలెడ్జి బోధించేవాళ్లం. జ్వాల ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకే సైకిల్‌పై బయలుదేరి మల్లేపల్లిలోని సీతారామ్ దేవాలయం నుంచి దాదాపు పదిహేను మైళ్లు ప్రయాణం చేసి సెంటర్‌కు చెమటలు కక్కుతూ ఎనిమిది గంటలకల్లా చేరేవాడు.





నేనేమో ముషీరాబాద్ నుంచి సైకిల్ తొక్కుతూ రోజు 10 మైళ్లు అదే అవస్థలో ఉద్యోగానికి హాజర్! అప్పటికే రాఘవాచారిగా జ్వాల, నేనేమో కె.యాదవరెడ్డిగా కవితలు, వ్యాసాలు, కథలు రాస్తూ 'గోలకొండ పత్రిక' 'స్రవంతి' ఆ తర్వాత 'ఆంధ్రభూమి'లో ప్రచురించేవాళ్లం. ఈ రచనల నేపథ్యంలో మా దిగువ మధ్య తరగతి జీవన సమరం.. నిరంతరం వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు.. అయినా పత్రికలు, గ్రంథ పఠనం మా వ్యసనం. అరిపిరాల విశ్వం, ఏ.మురళీధర్ లాంటి సీనియర్ కవుల సహచర్యంలో సాహిత్యంలో అడుగులు వేస్తూ కుందుర్తి ఆంజనేయులు వచన కవితా విశ్వవిద్యాలయంలో (ఫ్రీవర్స్ ఫ్రంట్) కవితాభ్యాసం చేస్తూ మా కుటుంబ సమస్యలను అధిగమిస్తూ.. 'రాత్రి' కవితా సంకలనం దాకా చేరుకున్నాము.





జ్వాలాముఖి పుట్టి పెరిగిన పరిసరాలు- వైష్ణవ సాంప్రదాయం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. హైద్రాబాద్‌లోని సీతారామ్‌బాగ్‌లో వున్న సంస్కృ త కళాశాల, ప్రాచీన దేవాలయం, దేవాలయం చుట్టూ పేద వైష్ణవ కుటుంబాలు, తమిళ బ్రాహ్మణ పూజారులు, వారి నియమ నిష్టలతో కూడిన ఆచార వ్యవహారాలు- అక్కడే ఈ రాఘవాచారితోపాటు నివాసముంటు న్న కె.కె.రంగనాథాచార్యుల కుటుం బం- కె.కె.ఆర్ చిన్నాన్న సంస్కృత విద్వాంసులు, ఒక పీఠాధిపతి. నాన్నగారు అడ్వకేట్.





జ్వాల నివాసమున్న రెండు గదుల ఇరుకైన పెంకుటిల్లు- ఆవరణలో పెద్ద చింతచెట్టు- దేవాలయ ప్రాకారాల మధ్య, ప్రవేశ ద్వారం పక్కన కె.కె.ఆర్ రోజూ తాడు ఆసరాగా ఇరుకైన మెట్ల మీదుగా చేరుకునే చిన్నగది. అటు దూరంగా పెద్ద బావి.. పక్కనే పొలాలు.. ఈ వాతావరణంలో పురోహితులతో అక్కడి పేద వైష్ణవ కుటుంబాల నివాస గృహాల హక్కుల కోసం ఒక సుదీర్ఘ న్యాయపోరాటం!





మేము ఎ.ఒ.సి.లో ఉద్యోగం చేస్తున్నకాలంలో, సాయం కళాశాలలో డిగ్రీలో చివరి సంవత్సరం- అప్పుడే నా ప్రేమ వివాహం 1963లో! కులాంతర వివాహం, పైగా అమ్మాయి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది.. ఇక ఆ రహస్య వివాహానికి జ్వాలాముఖి అన్నివిధాలా తోడ్పడి యాకుత్‌పురాలోని ఆర్యసమాజ్ మందిర్‌లో వివాహం జరిగించాడు. విజయవాడ దాకా తోడు వచ్చి నన్ను-యామినిని బెంగుళూర్ హానిమూన్‌కు పంపించేసాడు.





ఆ తర్వాత మా కుటుంబాల ఆత్మీయ సంబంధాలు ఎంతో ఆప్యాయంగా సాగిపోయిన దశలోనే మా పిల్లల కులాంతర వివాహాలకు ఆయన నిర్వాహకుడు. ఆయన పిల్లల కులాంతర- మతాంతర వివాహాలకు నేను నిర్వాహకుడిగా..!





ఎ.ఒ.సి. నుంచి ఉద్యోగాలు మారిపోయిన తర్వాత మా జీవన పోరాటాలు అనేక రకాల వొడిదొడుకులకు లోనైపోయాయి. ఎమ్.హెచ్.కేశవరావు అనే నగ్నముని చొరవతో 'దిగంబర కవులు'గా మేమంతా పరిణామం చెందాము. ఎక్కడా నాయకత్వం గొడవ లేకుండా పరస్పరం నేర్చుకుంటూ విమర్శించుకుం టూ ఆబిడ్స్‌లోని మా సంచాలకుడు సుబ్రహ్మణ్యం సెంట్రల్ పాయింట్ గది లో, ఓరియంటల్ హోటల్, కింగ్ సర్కి ల్ స్థావరాలుగా మూడు సంపుటాల ఆవిర్భావం. మిత్రులు కె.కె.ఆర్ ఈ పరిణామాలన్నింటికి ప్రత్యక్ష సాక్షి. ఆయన జ్వాలకు బాల్య మిత్రుడు. 'దిగంబర కవుల' మూడో సంపుటి విశాఖలో ఆవిష్కరణ సందర్భం- ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల మధ్య జ్వాల ప్రసంగం.. డాక్‌యార్డ్‌లో కార్మికుల సమక్షంలో మా కవితా పఠనం మరచిపోలేని అనుభవాలు. అప్పుడే అనిపించింది వచన కవితా ప్రక్రియలో కూడా సరైన శైలీ విన్యాసంతో రాసి, గొంతెత్తి నాటకీయంగా కవితలను చదివి కార్మిక కర్షకులను కూడా మెప్పించవచ్చని!





ఇక 1969-70 మధ్య దేశవ్యాప్తంగా సాగిన లెనిన్ శతజయంతి ఉత్సవాలు, సభలు, సమావేశాలు ఒక పెద్ద మలుపు. 'దిగంబర కవుల' మూడు సంపుటాల చింతనలో ఈ దశలోనే మార్క్సిస్టు అవగాహన మరింత గాఢతను సంతరించుకుంది. మేము ఇటు హైద్రాబాద్ మొదలు కరీంనగర్, కాకినాడ, విశాఖ తదితర ప్రాంతాల్లో లెనిన్ శత జయంతి సభల్లో పాల్గొని, కవితలు చదివి ఉపన్యసించి తీవ్రమైన వాద వివాదాల, సందేహ సమాధానాల అనుభవాలతో ప్రజల నుంచి ఎంతో నేర్చుకున్నాము.



ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటిలో విప్లవ భావజాలంతో ముందుకొచ్చిన పిడిఎస్‌యు విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి ఆహ్వానం మేరకు ఓ.యు సైన్స్ కాలేజీలో జ్వాల ప్రసంగం విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంది. మమ్మల్ని కాలేజీ ఉపన్యాసాలకు పిలిస్తే బాంబులతో వస్తారని ఆర్ఎస్ఎస్ అనుయాయులు (ఎబివిపి) కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసారు. అప్పుడు జ్వాల ప్రిన్సిపాల్ సమక్షంలోనే తనదైన శైలిలో ప్రసంగిస్తూ జేబుల్లోంచి కవితలు తీస్తూ, మేము బాంబులతో వస్తే పరిణామాలు మరో విధంగా వుండేవని చమత్కరించాడు.





నేనూ జ్వాల 1970 జనవరి తొలి రోజుల్లో అఖిల భారత ఒడియా (బరంపురం) యువ రచయితల మహాసభల్లో పాల్గొని విశాఖ చేరుకున్నాము. అప్పుడే శ్రీశ్రీ షష్టిపూర్తి ఉత్సవాల సంరంభం. ఆ శ్రీశ్రీ సన్మాన సభలో అంతకు మొదలు మేధావులకు విద్యార్థుల సవాల్ కరపత్రం సంచలనం కలిగించింది. అక్కడ ఉద్వేగంతో ప్రసంగించిన జ్వాలాముఖి వ్యాఖ్యానాలు తీవ్రమైన చర్చకు దారి తీసాయి. ఆ సాయంత్రం యూనివర్సిటీ ఆరుబయట రంగస్థలంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం (విద్యార్థి యూనియన్ ప్రారంభోత్సవం)లో శ్రీశ్రీ, కెవిఆర్, కొకు, రావిశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మూడు తరాలమధ్య సాగిన ఒక సంభాషణగా ఆనాటి ప్రసంగాల్లో జ్వాల ఉత్తేజకరమైన ప్రసంగం మా కవితాపఠనం మరో సంచలనం. అధ్యక్షత వహించిన సీనియర్ ప్రొఫెసర్, అర్థ శాస్త్ర నిపుణుడు సర్వేశ్వరరావుగారితో అదే వేదికపై మా వివాదం!





విప్లవ రచయితల సంఘం ఆవిర్భావంలో మా పాత్ర ఏమిటో అం దరికీ తెలుసు. ఆ తర్వాత పౌర హక్కుల కోసం శ్రీశ్రీతో పాటు ఆంధ్రప్రదేశంతా తిరిగాము. కెవిఆర్ సంపాదకత్వంలో వచ్చిన 'ఝంఝ' కవితా సంకలనం నిషేధం.. వెనువెంటే పిడి ఆక్ట్ కింద జ్వాలాముఖి, చెరబండరాజు, నన్ను ఆనాటి ప్రభుత్వం అరెస్టు చేసి ముషీరాబాద్ జైలులో నిర్బంధించింది. ఆ నిర్బంధాన్ని మేము హైకోర్టులో సవాలు చేయగా, న్యాయమూర్తుల చారిత్రాత్మక తీర్పుతో విడుదలై వచ్చాము.





విరసం నుంచి మా రాజీనామా, జనసాహితి స్థాపన మొదలైనవన్నీ మరికొన్ని ఘట్టాలు. జ్వాల నాతోపాటు ఒపిడిఆర్, గ్రామీణ పేదల సంఘం, భారత చైనా మిత్రమండలి, ఆం.ప్ర. కుల నిర్మూలన సంఘం అగ్రస్థానంలో వుండి క్రియాశీలక పాత్రను నిర్వహించాడు. విప్లవ నాయకులు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ప్రభావం రాజకీయ స్పష్టతనిచ్చింది.





సభలు-సమావేశాలు- ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు. 1971లో వచ్చిన 'ఓటమి తిరుగుబాటు' తర్వాత మళ్లీ మరో సంపుటిని ప్రచురించలేదు. 'వేలాడిన మందారం' నవల, హైదరాబాద్ కథలు వున్నాయి. ఆయన నిశిత వివేచనతో రాసిన సాహిత్య వ్యాసాలు సంపుటిగా రావలసి వుంది. వ్యక్తిత్వ దృష్ట్యా స్నేహశీలీ, ఆర్ద్ర హృదయుడు, భోజన ప్రియుడు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిస్పందించిన సాహితీవేత్త.





సభలు - సమావేశాలు - ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు. 1971లో వచ్చిన 'ఓటమి తిరుగుబాటు' తర్వాత మళ్లీ మరో సంపుటిని ప్రచురించలేదు. 'వేలాడిన మందారం' నవల, హైదరాబాద్ కథలు వున్నాయి. ఆయన నిశిత వివేచనతో రాసిన సాహిత్య వ్యాసాలు సంపుటిగా రావలసి వుంది.





- నిఖిలేశ్వర్

Friday, November 28, 2008

Lanco planing to shift to Delhi..?

It is the authenetic information that Lanco Group is thinking of shifting its head office from hyd to Delhi as they came to the conclusion Telangana is inevitable. In todays Directors & GMs meeting this discussion took place. Still the meeting is continuing. I will try to update u with further info, If a get any. This news is not yet reached media.


-naveen