Saturday, September 06, 2008

గొప్ప ప్రజాస్వామ్యము - అల్లం నారాయణ


దీనినే ప్రజల సమస్యలు చర్చించే చట్ట సభ అందురు. ప్రజలు మాత్రం ధర్నాచౌక్‌లో తమ సమస్యల మీద ధర్నాలు చేయుచుందురు. పోలీసులు వారిని తన్నుచుందురు. ఇది మన ప్రజాస్వామ్యమని చాలా గొప్పగా ప్రకటించుకోవచ్చును.


గణ గణ గణ గంట మోగును (గంటలు...గంటలు... గణ గణ గంటలు... గంటలు...గంటలు అను 'అలెన్‌పో'కు శ్రీశ్రీ అనువాదము కాదని మనవి చేయుతూ).. ఉపాధ్యాయ దినోత్సవ ము సందర్భముగా... నిన్ననే తాజాగా రక్షక భటులతో ఈడ్చివేయబడి ('బడి' అనగా... పాఠశాల అను అర్థములోనే సుమా. నేను 'నార్ల' వారి 'బడు'ద్దాయిని కాను) తన్నులు తినిన గురువుల పట్ల భక్తితో... గంట మోతతో ఈ కాలమ్‌కు శ్రీకార ము చుట్టి... అప్పటిదాకా గొట్టముల ముందు (గొట్టముల వా రు నామీద కినుక వహించకూడదు.


వారికా నామధేయమును శ్రేష్టమైన, మేలి తెలుగు భాషా రాష్ట్ర అధిపతియైన ముఖ్యమం త్రియే స్వయంగా ఖరారుచేసి ఉన్నారు.) తమకు తోచిన రీతి తాము, వారికి తోచిన తీరు వారు ఇష్టము వచ్చినట్లుగా వాగ్యు ద్ధాల గారడీ చేసిన ఎమ్మెల్యేలు, వారి అనుంగు సహచరులు, గొట్టముల వారు (గొట్టంగాళ్లు కాదని మరొక విన్నపం) బిల బిలమని ఆ మహా రాజప్రాసాదము వలె ఉన్న శాసనసభయను భవనములో ప్రవేశింతురు.


చివరన రెడ్డి గల సభాపతి గంభీరముగా కూచొని ఉందురు. అంతలో ఒకపక్క ముఖాలు మాత్రమే ఉద్రే కపూరితముగా కనిపించే ఎర్రెర్రని ముఖము గల కామ్రేడ్‌లు, పసుపు రాసుకున్న ముఖ ములతో ఇటీవలే ఎర్ర ప్రేమ ప్రదర్శిస్తూ ఐక్య కదన రంగంలో కాలుదువ్వే ప్రతిపక్ష తెలుగుదేశము వారు. ఉన్న ఇద్దరిలోనూ ఒకరు 'దొరబాబు'లా కాంగ్రెస్ ధగధగలకు ఆకర్షితులై వెళ్లిపోగా, ఒంటరియైనా తుంట రిని నేననే భాజపా ఒకే ఒక్కడు. పక్క వాద్యములు పలుచనైన స్థితిలో కొంచెం ఇటీవలే పసుపు రాసుకుంటూ (కొత్త మిశ్రమ వర్ణం) గులాబీకి వన్నె తెస్తున్న తెరాస వారు, 'కాకిరి బీకిరి కాంజాతా' అని శాసనసభ అంతయూ తెల్లబోతున్నా లెక్కచేయ క ఉర్దూలోనూ, ఆంగ్లంలోనూ, (సగం మంది గౌరవ నీయ శాస నసభ్యులకు ఈ భాషయూ కొరుకుడు పడదు.


అది తప్పుయును కాదు. స్వభాషాభిమానము.) భీకరముగా మైకులు బద్దలయ్యి దద్దరిల్లేలా ప్రసంగము చేయు అక్బరుద్దీను, వారి సహచరులు (తస్లీమా నస్రీన్‌పై దాడి ఫేమ్. మరియు... నగర అధికారులను భౌతిక ప్రక్రియలతో దారిలో పెట్టిన బాపతు) ఒకే ఒక్కలకే రాజారావు యను వాకపల్లి పోరాటమును చేసిన 'బసపా' సభ్యు డును, బయట పేరుకుపోయి చర్చ అత్యవసరమని భావించిన తమతమ సమస్యలను వాయిదా తీర్మానములవలె ప్రతిరోజు నూ ప్రవేశపెట్టెదరు. ఆ మొత్తము తీర్మానములన్నియు వీలు కాదనియు ప్రతి తీర్మానమునూ ఒక కట్ట కట్టి టోకుగా సభాపతి పక్కన బెట్టెదరు.


అంత వాయిదా తీర్మానములు ప్రవేశపెట్టిన సభ్యులందరునూ లేచి యధాశక్తిగా అరుచుదురు. అరగంట పాటు సమయం రోజువారీగా వీటికి ఉండును. మీమీ వాయిదా తీర్మానములు తిరస్కరించినామని సభాపతి కొంచెము ఆంగ్లము (నో...ఐ కాంట్... ఐయామ్ సారీ) కొంచెము ఆంగ్ల వాసనలతో కూడిన కొంచెము కొంచెము 'బ్రేకింగ్ తెలుగులోనూ' విస్పష్టము గా మీరెంత అరచి గీపెట్టినా మీ వాయిదా తీర్మానముల గతి అంతేయని తేల్చును. కాలము గడుస్తూ ఉండును. ప్రభుత్వ పక్ష ముతో అంటకాగుతున్నారన్న పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న తెరాస అసమ్మతి వారున్నూ, సమాజవాదులున్నూ, మరి కొందరున్నూ నిశ్శబ్దముగా ఈ తమాషాను రోజువారీ కళ్లప్పగిచ్చి చూతురు. కాలము గడుస్తూ ఉండును.


ఈలోపున ఒకించుక ఆవే శకావేశములకు లోనయిన తెలుగుదేశమువారు, అతి మామూ లుగా రాచదారి వలె సభాపతి ముందు గల బావి (ఇది 'వెల్'కు స్వేచ్ఛానువాదం) లోకి దూకి సభాపతి ముఖముపైకి చూపుతూ తీవ్ర వాగ్యుద్ధము చేతురు. సభాపతి ఏమాత్రము భాషా మార్పి డి లేకుండా పదేపదే వల్లెవేసినట్టుగా టీవీలలో వచ్చు సంకర భాషలో మళ్లీ మళ్లీ చెబుదురు. (టీవీల వారు మరొకమారు నన్ను క్షమించగలరు.) బహుశా సభాపతి భాష వల్లనే కొన్ని వార్తా చానళ్ల టీవీల వారు ఈ భాషను ప్రామాణికముగా తీసుకు ని వాడుతూ ఉండి ఉండవచ్చు.


ఇక 'వెల్'లో గొడవ తర్వాత అలసిపోయి వారు వెనక్కి తిరిగి వచ్చుటో, సభ వాయిదా పడు టో జరుగును. ఇక ఆ తర్వాత మళ్లీ గంట మోగును. సభాపతి వచ్చును. మళ్లీ వాయిదా తీర్మానముల గొడవ జరుగును. సభ వాయిదా పడును. అనంతరము ఒకానొక విరామము తర్వాత 'ప్రశ్నల' సమయం ప్రారంభమగును. సాధారణముగా ప్రశ్న వేయుదురు. మంత్రివర్యులు 'లేదండి', 'కాదండి', చర్చ తీసు కుందుము అని ముగిస్తురు. కానీ అత్యంత చరిత్ర గలిగిన మన శాసనసభలో ఒక ప్రశ్న ప్రారంభమవును. అప్పటి వరకును సభ లో ఇద్దరు అత్యంత ప్రముఖులు, మహా గొప్పవారు, ఒకేసారి రాజకీయ ములలోకి వచ్చిన ఉద్ధండులు, గత రాజకీయములో మంచి స్నేహితులు. ఒకే ప్రాంత మునకు చెందిన వారు.


ఆ ఇద్దరు చెరొకవేపు పరివేష్ఠి తులై తమ కాల్బలములు, అశ్విక దళముల లాంటి చతురంగ బలములను ప్రయోగించి చివరగా ఎవ రో ఒకరు రంగంలోకి దూకు దురు. అప్పుడు హఠాత్తుగా ప్రమాద ఘంటికలు మోగు ను. సభలో ఉద్రేకము, ఆవేశకావేశములు ఆవరిం చును. ముందుగా ప్రతిపక్ష నేత తెలియజేసుకుందురు. గత వైభవ మున ఆయన చేసిన పను లన్నియు పూసగుచ్చినట్టుగా, కొన్ని లెక్కలు, కొన్ని పత్రములు చదువుతూ వివరించును. (ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాక పోవడము సభ చేసుకున్న దురదృష్టము). చివరగా ఆయన తెలుగు ప్రజల కోసం ఏమిచేసెనో చెప్పును.


తుచ్ఛ, దుష్ట పాలన ఏవిధంగా సాగుతున్నదో తెలియ జేయును. అంత ఆవలి పక్క నుంచి తమ సహజ ధోరణిలో బొజ్జ నిమురుకుంటూ ఈయన చిన్ననాటి స్నేహితుడు లేచును. అధ్యక్షా! 'మామకు వెన్నుపోటు పొడిచిన ఈయనగారు... ఇక ప్రారంభమగును. మర్యాదకర సంభాషణము నుంచి, సరసముల నుంచి విరసము ప్రారంభమ గును. 'చంద్రబాబూ.. మీయమ్మ నిన్నెందుకు కన్నానా? అని చింతించేటట్టు చేస్తా' అనియు చంద్రబాబు పిచ్చివాడనియు, ఆషాఢభూతి అనియు, నీకు బుర్ర లేదనియు, బుద్ధి లేదనియు, వాగ్యుద్ధము చేసును. అంతకు ముందరి ప్రశ్న ఎక్కడో బిక్కు బిక్కుమని ప్రాణము కోల్పోవును.


రెట్టించిన ఉత్సాహముతో ప్రసంగము కొనసాగును. మధ్యలో ఇటు ఒకరు, అటు ఒకరు లేచి సభా నియమాలపైనను, కౌల్ అం డ్ షక్దర్ పైననూ కాసేపు కీచులాడుకుందురు. రోశయ్య ఒకించుక వ్యంగ్యముగా మాట్లా డును. నాగం జనార్దనరెడ్డి ఆవేశముగా ప్రసంగించి దొరికిపోవు ను, నోముల నరసింహయ్య పిట్టకథలు చెప్పును, చెన్నమనేని రాజేశ్వరరావు పెద్దమనిషిలా మాట్లాడే ప్రయత్నము చేయును. కన్నా లక్ష్మీనారాయణ ఆయనను దృత రాష్ట్రుడి న్యాయం అనును. ఆయన దీనిని కౌరవ సభ అనును. కిరణ్ కుమార్‌రెడ్డి ఏదో మాట్లాడును.


ఇట్లా మధ్యలో పుణ్యకాలము గడిచిపోతూ ఉండ గా, మళ్లీ రారాజు లేచును. అప్రతిహతంగా తనయొక్క వాక్చా తుర్యంతో చంద్రబాబును చీల్చి చెండాడుతూ... తీరిక సమయ ములో వికటాట్ట హాసం చేయును. అదే అదనుగా చంద్రబాబు మరోసారి 'మైకు దొరకబుచ్చుకుని తెలుగు జాతి కోసం మళ్లీ తెలి యజేసుకునును. ఈయన బాగాతింటున్నాడు. అందుకే నవ్వు తున్నాడు. అసెంబ్లీ అయినందున అట్లా ఉన్నాడు. బయటైతే కొట్టేట్టు ఉన్నాడు. (అనుమానం కూడా ఎందుకు) అని మ్రాన్ప డి, ప్రశ్నించును. అయినా తెలుగు జాతి కోసం ప్రాణమైనా ఇస్తా ను. చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారేమో. మీ ఆటలు సాగవు' అనును. సభ సభంతా ఈ ఇద్దరి వేపు మార్చి మార్చి చూసి అలిసిపోదురు. గుమ్మడి నర్సయ్య అనే విప్లవ శాసన సభ్యుడు రోజూ ఈ తంతు చూసి మరీ ఆలోచించును.



సభ రేప టికి వాయిదా పడును. రేపునూ సభ ఇట్లాగే జరగబోదని ఆ ఇద్దరూ ఇట్లా ప్రేమతో పలకరించు కోబోరని హామీ ఇచ్చువారు ఎవరూ లేరు. దీనినే ప్రజల సమస్యలు చర్చించే చట్ట సభ అందు రు. ప్రజలు మాత్రం ధర్నాచౌక్‌లో తమ సమస్యల మీద ధర్నాలు చేయుచుందురు. పోలీసులు వారిని తన్నుచుందురు. ఇది మన ప్రజాస్వామ్యమని చాలా గొప్పగా ప్రకటించుకోవచ్చును. 'ఈ గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియకు రోజూ కోట్లు ఖర్చగును. ఆ ఇద్దరికీ హెచ్చరిక : ఈ గొప్ప ప్రజాస్వామ్యంలో కొత్త పాత్ర లో జీవించుటకు చిరంజీవి పొంచి ఉన్నాడు జాగ్రత్త. నీతి : ఆ ఇద్దరిని జీవిత కాలంలో మళ్లీ శాసనసభకు గెలవ కుండా చూసే గురుతర బాధ్యత ప్రజలపైనున్నది. అట్లయినచో కొంతలో కొంత రోగ నిదానం జరుగును. అసెంబ్లీ కొంతైనా బాగుపడి దారిలో నడుచును

No comments: