Friday, September 19, 2008

సాంకేతిక తెలంగాణ సృష్టించాలి - చుక్కా రామయ్య


భూమి, భుక్తి, విమక్తి పోరాటాల నుంచి చైతన్యం పొందిన తెలంగాణ సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు అందరూ తలా ఒక చేయి వేయాలి. కాళ్ల కింద భూమిని కోల్పోతున్న దశను గుర్తించి కొత్త సోయితో ఉద్యమించాలి.


ఆగస్టు 15 (1947)న భారతదేశం శతాబ్దాల వలస పాలననుంచి విముక్తి పొందింది. తెలంగాణ అప్ప టికింకా ఒకపక్క నిజాంకు, మరో పక్క భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. భూమి, భుక్తి, విముక్తి కోసం మూడంచెల పోరాటాన్ని ఒకేసారి నిర్వహించవల సివచ్చింది. బ్రిటిష్ ఆంధ్రాలో కాల్పులు జరిగితే బ్రిటిష్ పార్లమెంటులో చర్చించేవారు. తెలంగాణలో విచక్షణా రహితంగా నిజాం ప్రభువులు కాల్పులు జరిపితే అడిగే నాథుడు లేడు. 1948 సెప్టెంబర్17కు ముందు వేలాది ప్రజల ప్రా ణాలు గాలిలో కలిసిపోయాయి. వాళ్ళ త్యాగాలను ఏ చరిత్రకారుడు లిఖించలేదు.
కనీసం వీర తెలంగాణ సా యుధ పోరాటంలో 4000 మంది అసువులు బాసారు. వారిపేర్లు కూడా ఎవరూ రాయలేదు. ఇంతమంది ఇన్ని త్యాగాలు చేసినా ఇప్పటివరకుకూడా ఎవరి చరిత్ర పైనా పరిశోధనా జరగనేలేదు. అటువంటి శ్రద్ధ చూపేవాళ్ళు కనిపించడం లేదు. ఈ పోరాటాలు చేయటానికి వీళ్ళం తా ఎక్కడికో వెళ్ళి శిక్షణ పొంది వచ్చినవారు కాదు. దేశ దేశాలు తిరిగిన వారు అంతకన్నా కాదు.

చరిత్రను చదు వుకుని, త్యాగాల గురించి తెలుసుకొని యుద్ధరంగంలో దూకినవారు అంతకన్నాకాదు. తెలంగాణలో ప్రజలకు పుట్టుకతోటే బానిసత్వం వచ్చింది. జీవితాలంటే చాకిరి చేయటం కోసమేననే స్థితి నెలకొంది. వెట్టిచేస్తూనే వల్లకా టికి పోయినకాలమది. అందుకే తెలంగాణలో వెట్టికి వ్యతిరేక పోరాటం చేయటమే విముక్తి పోరాటం. దున్నే వానికి భూమి కావాలని పోరాడటమే స్వాతంత్య్ర పోరా టంగా మారింది. సెప్టెంబర్ 17 తెలంగాణ మదిలో ఎన్నో ఆశలను రేపింది. భూస్వామ్యం, రాచరికం, వెట్టిచా కిరి పోతాయని తెలంగాణ ప్రజలు ఆశించారు. స్వాతం త్య్రం అంటే నిజాం పోవాలి, దున్నే వానికి భూమి అన్న ది ఆనాటి మన తాతలు, తండ్రుల మనోగతం.

సెప్టెంబర్ 17 వచ్చింది. తెలంగాణ ప్రజల కలలన్నీ నిజం కాబోతున్నాయని చూశారు. నిజంగానే నిజాం పోయారు. భూస్వామ్య వ్యవస్థపోలేదు. భూమి తన చేతుల్లోంచి వదిలినట్లుగా నటించి ఆ భూమిని తిరిగి వారు కైవసం చేసుకున్నారు. భూపోరాటాన్ని నీరు కార్చ టానికి చేయని ప్రయత్నాలు లేవు. వేయని ఎత్తులు లేవు. పాలకుల కుట్రలు కూడా అందుకు దోహదం చేశాయి. ప్రభుత్వమే భూములు పంచుతామని ముందుకు వచ్చిం ది. భూస్వాములు తమ ఆస్తులను ఆసరా చేసుకొని తమ రూపాన్ని మార్చుకున్నారు. ప్రజలఅసమానతలను అడ్డు పెట్టుకొని నాయకులుగా చెలామణీ అయ్యారు. వారే దేశాధినేతలయ్యారు. వారే రాష్ట్ర రథ చక్రాలను నడిపే నాయకులయ్యారు. వాళ్ళే దేశభక్తులుగా చలామణి అయ్యి పార్లమెంటు, అసెంబ్లీలకి వెళ్ళి పీఠాలపై కూర్చు న్నారు. తెలంగాణ మళ్ళీ దిక్కులేనిదైంది.

త్యాగాలు చేసి నవారంతా కాలగర్భంలో కలిసిపోయారు. తెలంగా ణలో ప్రతి ఊరికొక చరిత్ర ఉంది. తెలంగాణలో ఏ ఊరు చూసినా త్యాగాల భైరాన్‌పల్లెలే. సెప్టెంబర్ 17 తెలంగా ణ విమోచన దినంగా ప్రకటించిన నాటినుంచి స్థానిక భూస్వామ్యవర్గం కొత్త రూపెత్తింది. భూమి కావాలంటే తొక్కి పెట్టారు. సంస్కరణలు వాళ్ళే తీసుకొస్తామన్నారు. భూపోరాట ఉద్యమాన్ని తూట్లు పొడిచారు. ప్రభుత్వమే భూదానమన్నది. తెలంగాణ ప్రజలకు త్యాగాలు చేయ టం మాత్రమే తెలుసు తప్ప రాజకీయద్రోహాలు చేయ టం తెలవదు. వారి త్యాగాలు భూస్వాముల కుట్రలకు వ్యర్ధమయ్యాయి. ఎన్ని త్యాగాలు చేసినా ఇంతేనా అన్న పరిస్థితి నెలకొంది. ప్రజలింకా విముక్తి కాలేదు. అందుకే ఈ తెలంగాణ మట్టినుంచి ఉద్యమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పోరాటయోధుల వారసత్వంతో తెలంగాణ ముందుకు సాగుతుంది.

ఒకనాడు దొరల గడీలంటే తెలంగాణ ప్రజలు హడలి పోయేవారు. అందుకే దొరల గడీలమీద ప్రజలు తిరగబ డ్డారు. పల్లెల్లో గడీలు పోయాయి. పట్టణాలలో కొత్త గడీ లు వెలిశాయి. ఇప్పుడు ఆ గడీలు ఆధునిక రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ గడీల నుంచి వచ్చిన భూస్వా మ్య వర్గం పరిశ్రమలను నెలకొల్పింది. పెద్ద పెద్ద విద్యా సంస్థలను నెలకొల్పింది. అన్ని నియోజకవర్గాలను తమ చేతుల్లోకి తీసుకొని శాసనసభ్యులయ్యారు. పార్లమెంటు సభ్యులయ్యారు. అన్నిరకాల వ్యాపారాలను డబ్బున్న ఆ వర్గం చేతుల్లోకి పోయాయి. ఆధునిక దొరలు తెలం గాణలో వెలిశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆధు నిక దొరల గడీలకు వ్యతిరేకంగా నూతన ప్రజా ఉద్యమా లు రావాల్సివుంది. అందుకనుగుణంగా మొత్తం ప్రజా ఉద్యమాల స్వరూపం మారాలి.

హైదరాబాద్ నగర పరిసరాల్లో భూముల ధర పెద్ద ఎత్తున పెరిగింది. మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి లేకుం డా కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలే అభివృద్ధి జరిగిం ది. ఉన్నభూమి బహుళజాతి కంపెనీలకు దానం చేయ డం జరిగింది. అమెరికా వెళ్లినవారు ఇక్కడకు వచ్చి భూ ములు కొనడం మొదలుపెట్టారు. దీంతో రియల్ ఎస్టేట్ భూమ్‌పెరిగింది. మాఫియా గ్యాంగుల చేతుల్లోకి భూ ములు వెళ్లాయి. భూ అమ్మకాలకు ఆకర్షణ పెంచారు. వ్యాపారానికి రంగులు దిద్దారు. మాదాపూర్‌లోని ఇళ్ళకు పాతబస్తీలోని ఇళ్ళకు వ్యత్యాసం పెరిగింది. ప్రజలు ఇది చూస్తూ వచ్చారు.

గ్రామాలనుంచి బతకడానికి వచ్చిన వారిని అభద్రత వెంటాడుతోంది. ఈ వచ్చిన వాళ్ళ గ్రా మాల్లో ఉద్యమాలు చేసినవారు. ఈ అభద్రతను జయిం చటానికి పోరాటమే మార్గమనే నమ్మకం కలిగింది. ఇక నిలబడడానికి నీడ కోసం గూడుకోసం పోరాటపథం పట్టారు. ఆనాడు భూమికోసం నేడు నీడకోసం గూడు కోసం ఉద్యమం వచ్చింది. ఈ భూపోరాటం పట్టణాల్లో జరుగుతున్నది. ఆనాడు గ్రామాల్లో భూపోరాటం ఈనా టి ఇళ్ళ పోరాటానికి తేడాను గమనించాలి.ఈ పోరాటం ఎందుకొచ్చింది? ప్రపంచీకరణ వల్ల వచ్చింది. వలసలు పెరిగాయి. మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ పేదలంతా వలస దారి పట్టారు.

రంగారెడ్డి జిల్లా బాగా అభివృద్ధిచెందిన ప్రాంతం. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ఇక్కడ ప్రభుత్వ భూ ములు అధికంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం అమ్ముతు న్నది. బహుళజాతి కంపెనీలుకొంటున్నాయి. అంటే ఈ నాటి దృష్టంతా భూమి మీదకు మళ్లింది. ఇలాగే అయితే ఒక నిలబడేచోటు దొరకదని తెలిసి ప్రజలు నివేశన స్థలా లకోసం పోరాటాలకు దిగారు. దేశమంతటికీ ఈ పోరా టం కొత్త సందేశం ఇవ్వబోతుంది. సెప్టెంబర్ 17 స్ఫూర్తి కి నిదర్శనంగా ముందుకు సాగుతున్నది. తన ప్రాంతం పై ప్రేమను పెంచుకోవడమంటే ఇతర ప్రాంతాలను ద్వేషించడమని అర్థం కాదు. ఒక తల్లి తన పిల్లలను లేదా పిల్లలు తమ తల్లిని ప్రేమగా చూసుకోవడమంటే ఇతరు లను ద్వేషించటం ఎంత మాత్రంకాదు.

ఎవరైతే తన ప్రాంతంపై ప్రేమను పెంచుకుంటారో వారే ఆ ప్రాంతా న్ని అభివృద్ధిచేస్తారు. ఇలా ప్రాంతాలన్నింటిని అభివృద్ధి చేయడమంటే దేశాన్ని అభివృద్ధి చేయడమే. అపార సహజవనరులున్న తెలంగాణను వేగవంతంగా అభివృ ద్ధి చేయాలి. సాంకేతిక తెలంగాణను సృష్టించాలి. తెలం గాణ సాంకేతికంగా అభివృద్ధి చెందితే ఈ దేశానికి ఒక గొప్ప సంపదను అందించగలుగుతుంది. భూమి, భుక్తి, విమక్తి పోరాటాల నుంచి చైతన్యం పొందిన తెలంగాణ సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు అందరూ తలా ఒక చేయి వేయాలి. కాళ్ల కింద భూమిని కోల్పోతున్న దశను గుర్తించి కొత్తసోయితో ఉద్యమించాలి. భూమికోసం, నిల బడేజాగాకోసం జనం ఉద్యమజెండాగా మారకతప్పదు.

వ్యాసకర్త శాసన మండలిసభ్యులు. Andhra Jyothy 9-18-1008

No comments: