Thursday, October 30, 2008

తెలంగాణ స్వయం అవతరణ - టి. దేవేందర్ గౌడ్


జయహో తెలంగాణ! నవంబర్ 2వ తేదీన ఒక ప్రతీకాత్మక ప్రక్రియ- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ప్రజల స్వీయ పురోగతి- ప్రారంభమవుతుందని 'నవ తెలంగాణ పార్టీ' ఆవిర్భవించిన రోజునే హామీ ఇచ్చింది. మనం చాలాకాలం వేచివున్నాము. మన సొంత రాష్ట్రాన్ని మనమే ఏర్పాటు చేసుకొనే సమయమాసన్నమయింది. మన కర్తవ్యాన్ని మనం నెరవేరుద్దాం. ఆ పిమ్మట రాజకీయ ప్రక్రియ ప్రారంభమవగలదు.


తెలంగాణ ఏమి టి? తెలంగాణ ప్రజలకు దాని పరమార్థమేమిటి? ఇత్యాది వివరాలలోకి వెళ్ళే ముందు త్యాగధనులకు నివాళి అర్పించడం మన విధి. ప్రత్యేక తెలంగాణ కోసం 370 మందికి పైగా ప్రజలు ప్రాణాలు త్యాగం చేశారు. అది 40 ఏళ్లనాటి మాట. ప్రస్తుతం మూడు కోట్ల కుపైగా ఉన్న తెలంగాణ జనాభాలో సగంమంది 1969 సంవత్స రం నాటి ఊచకోతల అనంతరం జన్మించిన వారే.
ఆ తరువాత తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను ఎవరూ అణచివేయలేకపోయారు. ఇప్పుడు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహిస్తే 90 శాతానికి పైగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం వైపు మొగ్గు చూపుతారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కానేకారు. ఆ సమైక్య రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి భాగస్వాములు కావడానికి కూడా వారు ఎన్నడూ ఇష్టపడలేదు.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన నాటి నుంచి ముల్కీ నిబంధనలు, ఆరు సూత్రా ల పథకం, తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారాలు, భూముల విక్రయంపై నిషేధం మొదలైన రాజ్యాంగబద్ధమైన రక్షణలను ఆంధ్ర నాయకత్వం ఆధిపత్యంలోని ప్రభుత్వాలు ఉల్లంఘించాయి. తెలంగాణ దోపిడీ చేయబడింది. అవహేళనల పాలైంది. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, వారి ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ రాజకీయ నాయకులు సమైక్యంగా పూనుకోవాలి.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామిక తీర్పు. చారిత్రిక కర్తవ్యం. నైతిక బాధ్యత. ప్రజాతీర్పును గౌరవించి, తెలంగాణను ఏర్పాటుచేస్తున్న ప్రజల ప్రకటనను పండగ చేసుకొంటున్నాము. 2008 నవంబర్ 1న తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉనికి అంతమయినట్టే. నిజానికి ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజునే అది అంతరించింది. సకల ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఆ సమైక్యరాష్ట్రం ఆవిర్భవించింది.

తొలుత, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు విరుద్ధంగా జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ సిఫారసు ఉల్లంఘన జరిగిం ది. తెలంగాణ ప్రజలు, నాయకులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, బలవంతంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కు అంగీకరింప చేశారు. కనుక తెలంగాణ ఏర్పాటును ప్రకటించడం ద్వారా మన నిజమైన ఆకాంక్షను పునరుద్ఘాటిస్తున్నాం. తెలంగాణ ఏర్పాటు ప్రకటన పట్ల కొంతమంది రెండు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. అవి:
(అ) అధికారిక ప్రక్రియ లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మనమెలా ప్రకటిస్తాం?
(ఆ) ఏ లక్ష్యానికి ఈ ప్రకటన తోడ్పడుతుంది?
ఈ రెండూ సహేతుకమైన ప్రశ్న లే. వాటిపై సుదీర్ఘ చర్చ ఎంతైనా అవసరం. అయితే క్లుప్తంగా సమాధానమిస్తాను. ప్రత్యేక తెలంగాణ పోరాటచరిత్ర సుదీర్ఘమైన ది; స్వతంత్ర భారతదేశంలో మరే పోరాటంకంటే తెలంగాణ పోరా టమే సుదీర్ఘమైనది. ఈ ప్రత్యేక రాష్ట్రోద్యమానికి ఆది నుంచీ ప్రజల మద్దతు ఉంది.
అయితే రాజకీయ యంత్రాంగమే ప్రజల డిమాండ్ ను తప్పుదోవ పట్టించింది. ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రజాస్వామ్యాలు గౌరవిస్తాయి. వాటిని నెరవేర్చడానికి అవసరమై న ప్రక్రియలకు చొరవ తీసుకుంటాయి. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంలో నివసించదలిచారు. పాలకులు వారి న్యాయబద్ధమైన ఆకాంక్షను పట్టించుకోనప్పుడు దానిని నెరేవేర్చడానికి పౌర సమాజమే పూనుకోవాలి. అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలి. కను క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం ఆ ప్రకియను ముందుకు తీసుకుపోవడమే. ఇలా ప్రకటించడం చరిత్రలో ఇదే మొదటిసారి కాదు. భారత స్వాతంత్య్ర సమరంలో లాహోర్‌లో (1930 జనవరి 26న) జరిగిన జాతీయ కాంగ్రె స్ మహాసభ 'పూర్ణ స్వరాజ్'ను లక్ష్యంగా ప్రకటించింది. ఆ మహాసభలోనే త్రివర్ణ పతాకాన్ని తొలిసారి ఆవిష్కరించారు.
ఆ చరిత్రాత్మక ప్రకట న జరిగిన రోజునే ఇప్పుడు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకొంటున్నాము. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ 1943లో భారతజాతీయ సేన అధిపతిగా భారత స్వాతంత్య్రాన్ని ప్రకటించారు. సింగపూర్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కొనసాగడం ఇష్టం లేక ఆంధ్ర నాయకులు 80 ఏళ్ల క్రితం 'స్వరాష్ట్ర' నినాదంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యమించలేదా? ఇటువంటి ఉదంతాలు ప్రపంచ చరిత్రలో చాలా ఉన్నా యి. వాటి నుంచి ఉత్తేజం పొంది తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తున్నాము. ఈ ప్రత్యేక రాష్ట్రం త్వరలోనే అధికారికంగా ఆవిర్భవించ డం ఖాయం. కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం ద్వారా మన దేశంలోనూ, ప్రపంచంలోనూ ఒక సువ్యవస్థితమైన చారిత్రిక సంప్రదాయాన్నే మేము అనుసరిస్తున్నాము. ఆ నేపథ్యంలోనే ఈ ప్రకటనను కూడా చూడాలి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నాము. ఆత్మగౌరవోద్దీప్తులను చేస్తున్నాము. సమైక్యరాష్ట్ర పాలకులకు చారిత్రిక అనివార్యతను గుర్తుచేస్తూ గట్టి హెచ్చరిక చేస్తున్నాము.
ఇక రెండో ప్రశ్న- ఏ లక్ష్యానికీ ఈ ప్రకటన తోడ్పడుతుంది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు తెలుపడానికి ప్రజలు ధైర్యం చేస్తారు. నిండు ఆత్మవిశ్వాసంతో ఉద్యమంలో పాల్గొంటారు. దీంతోపాటు వారు తమ వాహనాల నెంబర్ ప్లేట్లకు కొత్త రాష్ట్రం పేరును టిఎల్ అనే అక్షరాలతో లిఖించాలి. సైన్ బోర్డులను మార్చాలి. తెలంగాణ సరిహద్దు చిహ్నాలు ఆ బోర్డ్‌లపై రాయాలి. తెలంగాణ పతాకాలను ఎగురవేయాలి. ఇత్యాది మూక్ముమడి ప్రతీకాత్మక చర్యలద్వారా ప్రత్యేక తెలంగాణకు సానుకూల వాతావరణాన్ని సృష్టించిన వారవుతారు. ఉద్యమం పట్ల సందేహంతో ఉన్నవారిని సుముఖులుగా చేయడానికి ఈ చర్యలు విశేషంగా తోడ్పడుతాయి. ఒక లక్ష్యానికి మద్దతుగా ప్రజలను సమీకరించడంలో ప్రతీకాత్మక చర్యలు చేసే దోహదం అంతా ఇంతా కాదు. ఉద్యమకారు లు ప్రజాస్వామ్యబద్ధంగా తమ శక్తిని వ్యక్తం చేయడానికి ఇవి ఎంతైనా తోడ్పడతాయి.
సరే, ఆ తరువాత ఏమిటి? ప్రజలు చేయవలసిందేమిటి? వారు చాలా చేయవచ్చు. ఈ విషయంలో కొత్త భావాలను ఆహ్వానిస్తు న్నాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక కొత్త, నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని మాకు బాగా తెలుసు. మాతో సంఘీభావాన్ని ప్రకటించే కొత్త ప్రజాస్వామిక ఆలోచనలను ఆహ్వానిస్తున్నాము.
ప్రజల లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి రాజకీయవేత్తలు ఎంతైనా చేయగలరు. తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తున్న ఈ పవిత్రదినాన తెలంగాణ రాజకీయవేత్తలందరికీ, వారు చేయవలసిన వాటిలో కొన్నిటిని సూచిస్తాను:
(అ) మనమందరమూ, అన్ని పార్టీలకు చెందినవారమూ ఎప్పుడో ఒకసారి ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు ప్రతిస్పందించడంలో విఫలమయినవాళ్ళమే. తెలంగాణ ఉద్యమాన్ని నీరుకార్చివేయడానికి మనలో విభేదాలు సృష్టించడంలోను, బెదిరింపులతో లొంగదీసుకోవడంలోను, అపహాస్యం చేయడంలోను ఆంధ్రనాయకత్వం సఫలమయింది. అయితే ఎప్పుడూ కొంత మం ది వ్యక్తులు, కొన్ని సంస్థలు తెలంగాణ ఆకాంక్షను సజీవంగా నిలుపుతూ వచ్చాయి. ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు ఒక వాస్తవాన్ని గుర్తించాయి. ప్రత్యేక రాష్ట్రం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కాగలవనేదే ఆ వాస్తవం. కనుక తెలంగాణ లక్ష్యాన్ని సాధించడానికి సమైక్యంగా కృషి చేస్తామని శపథం పూను దాం. సమైక్య కృషి ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పాటుకు ఆమోదించేలా ఢిల్లీ పాలకులపై విజయంవంతంగా ఒత్తిడి చేయగలం.
(ఆ) మన ఉమ్మడి లక్ష్య సాధనకు సమైక్యమవుదాం. మన తప్పుల ను మరచిపోదాం. అయితే ఆత్మ విధ్వంసకపథంలో కొనసాగడాన్ని ఇక వదిలివేద్దాం. పరస్పరం నిందించుకోవడం, దూషించుకోవడం మానివేద్దాం.ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిద్దాం. ఆంధ్ర లాబీకి న్యాయబద్ధత సమకూర్చే చర్యలకు పాల్పడకుండా మనం జాగ్రత్త వహిద్దాం.
(ఇ) కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఏ పార్టీ, ఏ సంస్థ ప్రతీక అనే చర్చకు పోవద్దు. లక్ష్య సాధనకు తోడ్పడే ప్రతీకాత్మక చర్యలకు దోహదం చేయాలి. మనలో ఉన్న విభేదాలను మరింతగా పెంచి తెలంగాణ వ్యతిరేక శక్తులు లబ్ధి పొందకుండా మనం జాగరూకత వహించాలి. అందరికీ తెలిసివచ్చేలా అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ ప్రజల కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
తెలంగాణ ఏర్పాటు మహా లక్ష్య సాధనకు మీ వంతు సహకారం అందించడానికి ఇది ఒక అవకాశం. ప్రతీకాత్మక చర్యల ద్వారా గమ్యాన్ని చేరడం కష్టమని కొందరు ఆక్షేపణ చెప్పవచ్చు. అయితే మన సొంత చరిత్రను, మన పోరాటాల చరిత్రను చదవమని వారిని నేను అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రం నవంబర్ 2న ఏర్పాటవుతుంది. ప్రజల ప్రకటనను అనుసరించి అధికారిక ప్రక్రియ ప్రారంభమవుగాక.
(వ్యాసకర్త 'నవ తెలంగాణ పార్టీ' అధ్యక్షులు)
ఆంధ్రజ్యోతి 31 అక్టోబర్ 2008.
.

నవంబర్1న విద్రోహదినాన్ని పాటిద్దాం...!




Monday, October 27, 2008

మా మూసీ ఎక్కడ..? నిఖిలేశ్వర్



ఆంధ్రజ్యోతి అక్టోబర్ 27, 2008

Monday, October 20, 2008

భూమి కోసం

వామనుడు అలనాడు బలి చక్రవర్తిని మూడడుగుల భూమి మాత్ర మే అడిగాడు. అడిగే వరకూ వామనుడే. ఆ తరువాత ఇంతింతై... భూగోళాన్నంతా ఒక్క అడుగుతో ఆక్రమించాడు. ఎలాగైతేనేం ఎంత భూమిని ఆక్రమించుకుంటామనేదే ప్రధానం! కాలమేదైనా ప్రపంచ చరిత్ర అంతా భూమి చుట్టే తిరుగుతూ ఉంటుంది. చరిత్రలో ఎక్కువ పోరా టాలు భూమి కోసం, భుక్తి కోసం సాగినవే. అట్లాంటిక్ జలాలకు అటూ ఇటూ భూమి పుత్రులు తమ హక్కుల కోసం చేసిన తిరుగుబాట్లు- వారి అణచివేతలతో- భూగోళమంతా రక్తంతో లేదా కన్నీళ్ళతో తడిసి పోయింది. తెలంగాణ సాయుధ పోరాటం మన పెద్దలు వినిపించిన వీరోచిత గాథ- భూమి కోసమే సాగింది. స్వాతంత్య్ర సమరం పొడుగునా, అంతర్లీనంగా రైతాంగ పోరాటాలూ సాగాయి.



రైతుకూ భూమికి ఉండే అనుబంధం గాఢ మైనది. వ్యవసాయం సంక్షోభంలో పడినా, భూమి చేజారి పోయినా, సమా జం అతలాకుతలమై పోతుంది. భూ సంబంధాలు మారినప్పుడూ, భూగో ళం పురిటి నొప్పులు పడుతుంటుంది. అందుకే మధ్యయుగాలలో యూరప్ నిండా రైతుల పోరాటాలు. ఫ్రెంచి విప్లవానికి ముందే జర్మనీ రైతాంగంలో కదలిక వచ్చింది. పైకి మతం మేలి ముసుగు కనిపించినా, రైతాంగంలోని అసంతృప్తి బద్ధలై యూరప్‌లోని ఇతర దేశాలలోనూ ప్రతిధ్వనించింది. బంగారం లాంటి భూముల కోసమే కొన్ని దేశాలలో రైతుల తిరుగుబాట్లు ప్రభుత్వాలను కూల దోసి చరిత్రను మలుపు తిప్పాయి. అవి కొందరికి వేగు చుక్కలుగా కనిపిస్తే, మరికొందరికి తోక చుక్కలుగా తోచాయి! అన్ని దాహాల కన్నా భూ దాహమే ఎక్కువ ప్రమాదకారి. యూరప్ వల స వాదులు అడుగు పెట్టిన క్షణాన అమెరికా నేల రక్తసిక్తమైంది ఈ భూమి కోసమే.

అమెరికా భూములు శ్వేత జాతీయుల ఆక్రమణలోకి వచ్చే క్రమం లో లక్షలాది మంది భూమి పుత్రులు బలయ్యారు. మిసిసిపి నదిలో స్థానిక తెగల రక్తం ప్రవహించింది. 1637 నాటి పికాట్ వార్ కానీ, కింగ్ ఫిలిప్స్ వార్, కింగ్ విలియమ్స్ వార్, క్వీన్ అనీస్ వార్ అంటూ ముద్దు పేర్లు పెట్టు కున్న దాడులన్నీ తెల్లవారు విశాలమైన కొత్త భూముల కోసం సాగించిన స్థానిక తెగల ఊచకోతలే. యూరప్ దొరలు తమ అస్తిత్వం కోసం పోరాడిన భూమి పుత్రులను ఉరికంబాలు ఎక్కించారు. స్త్రీలు, పిల్లలనే విచక్షణ లేకుం డా గ్రామాల నుంచి ప్రజలను తరలించి అహోరాత్రులు నగ్నంగా చలిలో నిలబెట్టారు. నిర్బంధ శిబిరాలలో చిత్ర హింసలు పెట్టారు. వ్యాధులకు గురై ఎనభై శాతం స్థానిక తెగల జనాభా అంతరించి పోయింది. మశూచి వంటి ఈ రోగాలు స్థానిక తెగలలో వ్యాప్తి చేయడం వెనుక యూరప్ పాలకుల కుట్ర ఉందనే బలమైన ఆరోపణ ఉంది. స్థానిక తెగలను శాంతింప చేయడా నికి కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ నీటి మూటలే. 19 వ శతాబ్దంలో ఇండి యన్ రిమూవల్ అనేది అమెరికా ప్రభుత్వ విధానమే అయిపోయింది.

ఈ 19 వ శతాబ్దం చివరి దాకా భూమి పుత్రుల రక్తం చిందుతూనే ఉంది. స్థానిక తెగల వారిని నాగరీకులను చేయడం, విలీనం అంటూ ఏ పేరు పెట్టినా, చివరకు వలస వాదుల లక్ష్యం వారి భూములు కబళించి, వారి అస్తిత్వాన్ని హరించడమే అనేది చారిత్రక సత్యం. ఇదీ అమెరికా వంటి నాగరిక దేశపు భూమి చరిత్ర. అమెరికన్ కంపెనీల అభివృద్ధిలో భాగంగా లాటిన్ అమెరికా భూములు ఎడారులైన నేపథ్యంలోనే, నేడు అక్కడ కొత్తగా అమెరికా వ్యతిరేక ప్రభు త్వాలు మళ్ళీ మొగ్గదొడిగాయి. జింబాబ్వేలో సంక్షోభానికి కారణం ఆ దేశ నేత రాబర్ట్ ముగాబేనని పాశ్చాత్య దేశాల వాదన. దేశంలో తిష్ఠవేసిన పది శాతం తెల్లదొరల చేతిలో తొంభై శాతం నల్ల భూములుండడం అసలు సమ స్య అనేది మరో బలమైన వాదన. తన ఆకలి తాను తీర్చుకోగలిగేదే గొప్ప దేశమని డీగాల్ ఫ్రెంచి ప్రజలకు ఎప్పుడో చెప్పాడు. ఆ ఆకలి తీరాలంటే, ఎవరి భూములు ఎవరి చేతిలో ఉంటాయనేది ముందు తేలాలి. భూమి సమస్య ఇప్పుడు మన దేశాన్నీ తాకింది. అదీ సెజ్‌ల రూపంలో. భూమి విలువ మొదటి సారిగా పశ్చిమ బెంగాల్ పెద్దలకు తెలిసి వచ్చింది.

ఇప్పుడు మన రాష్ట్రాన్నీ భూ కంపం తాకుతున్నది. ఎస్ఇజడ్‌లకు, కోస్టల్ కారిడార్‌కూ వ్యతిరేకంగా ఆందోళన ఊపందుకుంటున్నది. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు (ఎస్ఇజడ్) పెట్టిన చోటల్లా స్థానికుల ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. అయితే అధికార పార్టీ, దాని మిత్రపక్షాలు మినహా రాష్ట్రంలోని ప్రధాన పక్షాలన్నీ ఒక ఉమ్మడి వేదిక పైకి వచ్చి ఉద్యమిస్తున్న ప్రజలకు రాజ కీయ ఛత్రంగా మారాలని నిర్ణయించడం అసాధారణం. ఈ ఉద్యమం ఉభ య కమ్యూనిస్టు పార్టీలతో పాటు, టిఆర్ఎస్, టిడిపి, ప్రజారాజ్యం పార్టీల ను, ఎంబిటి వంటి చిన్న పార్టీలను ఒకే వేదికపైకి తేవడం గమనార్హం. ఎస్ఇ జడ్‌లను ప్రశ్నించడమంటే అభివృద్ధిని వ్యతిరేకించడమనే ఆరోపణలకు స్థానం లేకుండా పోయింది. అభివృద్ధిని అందరూ కోరుకుంటారు. కానీ అభి వృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతాయి, త్యాగాలు ఎవరు చేయాలనేదే సమస్య.

ఎస్ఇజడ్‌లలో వ్యాపారావసరానికి మించి భూమి కేటాయింపులు జరప డం, నిర్వాసితుల ప్రయోజనాలు కాపాడక పోవడం అనేవి విమర్శలకు తావిస్తున్నాయి. నర్మద నదిపై ఆనకట్ట వల్ల నిర్వాసితులైన వారు సాగించిన ఆందోళన దేశ వ్యాప్తంగా గుర్తింపునకు వచ్చింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. అందు వల్లనే నిర్వాసితులు సమైక్యంగా ఉద్యమించే పరిస్థితి ఏర్పడింది. ఎస్ఇ జడ్‌లు రాష్ట్రవ్యాప్తంగా నిర్వాసితులను కదిలిస్తున్నాయి. మరోవైపు కోస్టల్ కారిడార్ ఒక్కటే మొత్తం కోస్తా సమాజాన్ని కలవర పెడుతున్నది. లక్షలాది ఎకరాలు అభివృద్ధి పేరిట చేతులు మారుతుంటే ఆ ప్రభావం సమాజంపై ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే రాజకీయ పక్షాలను రంగంలోకి దింపింది. వచ్చే ఎన్నికలలో ఈ భూమి సమస్యనే ప్రధానాంశం గా మారినా ఆశ్చర్యం లేదు.



ఆంధ్రజ్యోతి సంపాదకీయం, 21 October 2008

అసదుద్దీన్ ఏం కోరుకుంటున్నారు?







తెలంగాణ వాదం బలపడి, సమైక్యవాదులు సైతం జై తెలంగాణ అంటున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్పని సరిగా మారుతున్నది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు రెండూ తెలంగాణకు అనుకూలంగా తీర్మానించడంతో ఏకాభిప్రాయం లేదనే సాకులకు కాలం చెల్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంక్లిష్టమైన ప్రక్రియ అనే రాజశేఖరెడ్డి వాదన పస లేనిదిగా ఢిల్లీ పీఠం ముందు తేలిపోయింది. దీంతో తెలంగాణ ఏర్పాటులో జటిలత్వాన్ని కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మతాన్ని వాడుకునే ప్రమాదకర ఎత్తుగడను ప్రయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నాటకంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోషిస్తున్న కీలుబొమ్మ పాత్రకు తోడుగా అసదుద్దీన్ మతం ముసుగుతో చేరారు.



బ్రిటీష్ వారు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి మత విద్వేషాలను రగిల్చి వాడుకున్నారు. ఇప్పుడూ అదే విధానం అమలవుతున్నది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను విడదీయాలని కుట్ర సాగుతున్నది. తెలంగాణ ప్రజల నుంచి హైదరాబాద్ ముస్లింలను వేరు చేసే దారుణానికి ఒడిగడుతున్నారు. అక్కడితో ఆగకుండా ముస్లింల నుంచి హైదరాబాద్ ముస్లింలను విడదీసి చూపించే ఘాతుకానికి తెరలేపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలది మత సంఘర్షణల సంస్క­ృతిగా చిత్రీకరించే ఎత్తుగడ సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింల మనుగడకు ముప్పు ఏర్పడుతుందనే భయాన్ని వారి మనసు లో నాటుతున్నారు. నిజానికి తెలం గాణది ఇరుమతాల మధ్య మమతానుబంధాలు పెనవేసుకుపోయిన చరిత్ర. కట్టు, బట్ట, తిండి, తిప్పలు అన్నీ ఒకటి గా బతుకుతారు. ఇక్కడి వీధుల్లో ఉర్దూ, తెలుగు కలిసి చెమ్మచెక్క ఆడుకున్నాయి. అన్ని ఆరాట పోరాటాల్లోనూ కలిసే ఉన్నారు.






ఇవాళ తెలంగాణ ఉద్యమం గొప్పగా చాటుకుంటున్న తుర్రెబాజ్‌ఖాన్ వంటి వీరుల చరిత్ర ఇటీవలి వరకు అణచివేతకు గురైంది. తెలంగాణ రైతాంగ పోరాటంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూమి పోరులో అమరుడైన బందగీ, పత్రికా స్వేచ్ఛకు ప్రాణమిచ్చిన షోయెబుల్లాఖాన్, భావుకతను, తిరుగుబాటు తీవ్రతను మేళవించిన కవియోధుడు మఖ్దూం వంటి వారినందరినీ ఈ నేల సగర్వంగా స్మరించుకుంటున్నది. తెలంగాణ ప్రజలు ఉర్దూని తమ భాషగానే భావిస్తారు. ఒకనాడు తౌరక్యాంధ్రులంటూ తెలం గాణ తెలుగు, ముస్లింలను కించపరచినవారే నేడు వారిని మతం పేర విభజింప చూస్తున్నారు. తమ పాలనలోనే ముస్లింలకు రక్షణ అని పరోక్షంగా పలికిస్తున్నారు. కానీ తెలంగాణ నాయకుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసేందుకు సృష్టించిన మతకలహాల్లోనే లెక్కకు మించిన ముస్లింలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కొట్లాటల్లోనే అపురూపమైన తెలంగాణ కవి గులాం యాసిన్ బలైపోయారు. తనకు తాను ముస్లింల ప్రతిని«ధిగా చెప్పుకునే అసదుద్దీన్‌కు తెలంగాణ ముస్లింల బతుకుల పట్ల పట్టింపు లేదు.

నదీజలాల్లో వాటా దక్కక వ్యవసాయం కూలిపోయి ఎందరో ముస్లిం రైతులు కూడా ఆత్మహత్యల పాలయ్యారు. ఊళ్లో పూటగడవక గల్ఫ్ ఎడారుల్లో ఎందరో ముస్లిం యువకులు మెతుకులేరుకుంటున్నారు. కవి గోరటి ఎంకన్న పాడినట్టు 'పరక చాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికోయిరి, లారీలల్ల క్లీనర్లయ్యిర? పెట్రోలు మురికిల మురికయ్యిన్రా? తల్లీ- దూదు సేమియకు దూరమయ్యినారో సాయబుల పోరలు, ఆ బేకరి కేఫుల ఆకలి తీరిందో ఆ పట్టణాలలో!' అని తెలంగానం చేస్తున్న ఆక్రందనలు, తెలంగాణ ఉద్యమం వేస్తున్న ప్రశ్నలు అసదుద్దీన్ చెవికెక్కినట్టు లేదు. హైదరాబాద్ రాష్ట్రంలో 40 శాతానికి పైగా ముస్లిం ఉద్యోగులు ఉంటే సమైక్య రాష్ట్రంలో నాలుగు శాతానికి కూడా నోచుకున్నది లేదు.

జాతీయ సమగ్రతా మండలి వేదిక మీద సచార్ కమిటీ అమలు గురించో, అమాయక ముస్లింల మీద అనుమానంతో జరుగుతున్న అమానవీయ దాడుల గురించి అసదుద్దీన్ అడిగి ఉంటే అర్థవంతంగా ఉండేది. కానీ ఒకరి చేతిలో చిలుకగా మారి, వారి పలుకులు వినిపించడం సరికాదు. హైదరాబాద్‌తో పేగు సంబంధంలేని పాలకులు తమ రియల్ ఎస్టేట్ ఆస్తుల అడ్డాగా మాత్రమే ఈ నేలను చూస్తున్నారు. వక్ఫ్ ఆస్తులను వాటాలుగా పంచుకుంటున్నారు. నాటి అసఫ్ జాహీ రాజులు, మరుగునపడ్డ అజంతా ఎల్లోరా గుహలను పరరిక్షించి ప్రపంచం ముందుంచారు.

రామప్ప దేవాలయం శిథిలం కాకుండా చర్యలు తీసుకున్నారు. తస్కరించిన శిల్పాల్ని కూడా వెతికి తెప్పించి యథా స్థానం లో అతికించారు. ఆబిడ్స్‌లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన, తాను చదువుకున్న చాదర్‌ఘాట్ స్కూల్‌ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తే చెన్నారెడ్డి అడ్డుకున్నారు. కాని నేడు అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌లోని అపురూప నిర్మాణాలను కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టుకున్నారు. ఎటువంటి భావోద్వేగాలు లేని కులాతీత, మతాతీత, ప్రాంతాతీత దోపిడీ తత్వమే పాలకుల సమానత్వం. అసదుద్దీన్ ఈ సమానత్వాన్నే కోరుకుంటున్నారా?



- దేశపతి శ్రీనివాస్



సంగిశెట్టి శ్రీనివాస్

Wednesday, October 15, 2008

మా నాన్న సుద్దాల హనుమంతు - సుద్దాల అశోక్ తేజ







స్టేజీ మీద సుద్దాల హనుమంతు గొల్లసుద్దులు 'వీర తెలంగాణ' చెబుతున్నాడు. అక్షరాలు రాని అరకలు పట్టే రైతుకూలీలు ఆయుధాలు పట్టి ఆడాళ్లు వడిసెలలు పట్టి ఎలా దొరలను రజాకార్లను నైజాం పోలీసులను, రౌడీలను తరుముతున్నారో హనుమంతు దళం వీరావేశంతో చెబుతుంది. 1947 నుండి 1951 దాకా సాగిన 'మహాగాధ'ను కళ్ళకు కట్టినట్టు చెబుతుంటే ఆ జనంలోనే ఎదురుగా జానకమ్మ తన మూడు నెలల బాబును ఎత్తుకొని చూపిస్తున్నది.
'పల్లవి గెరిల్లా ముట్టడిలా అట్టాక్ చేసినట్టు వుండాలి. పల్లవిలో మొదటి వాక్యమే శ్రోతల దిమ్మదిరిగేలా వుండాలి. ఆ పాట ఇతివృత్తం ఏ రసానికి చెందిందో అందులోకి పాటలోని మొదటి వాక్యమే ఈడ్చుకు రావాలి. మనం వాడే ప్రతీకలు, ఉపమానాలు, ఉత్ప్రేక్షలు శ్రోతలను మన పాట ఆవరణలోకి తీసుకవచ్చి కట్టిపడేయాలి. అలాగే పాటలో మనం ఇచ్చే ముగింపు శ్రోతలను వెంటాడాలి. కొన్నిరోజులదాకా గుర్తుండేలా, ఎప్పటికీ గుర్తుకొచ్చేలా ఉండాలి.'
ఆబాబుకు ఏం అర్ధమైందోకానీ సుద్దాల హనుమంతు వైపు రెప్పవాల్చకుండా చూస్తూ పిక్కలు బిగదీసుకొని పిడికిళ్లు బిగించి ఉద్విగ్నంగా చూస్తున్నాడు. అది చూసి పక్కన కూర్చున్న అమ్మలక్కలు ముక్కున వేలేసుకుని 'వేలెడంతలేడు. ఎట్ల చూస్తుండు తండ్రి దిక్కు!' అన్నారట. ఆ మూన్నెళ్ల బాబును నేనే. ఎత్తుకున్నది మా అమ్మ జానకమ్మ. ఎదురుగా మా నాన్న ప్రజాకవి- ప్రజా కళాకారుడు సుద్దాల హనుమంతు. ఈ సంఘటన నాకు జ్ఞాపకం ఉండే అవకాశం లేదు కానీ మా అమ్మ, మా మేనమామ చెప్తుంటే ఎన్నోసార్లు విన్నాను. బహుశా అప్పుడే నాన్న భావోద్వేగం నాలోకి ప్రవహించిందా.. ఆయన రక్తమే నాలో ప్రవహిస్తుంటే అప్పుడు ఇప్పుడు అనేదేముంది. ఇంకా నాన్నలోని ఆ సృజనాత్మక ఉద్యమ రచనాశక్తి ఇంకిపోకుండా నాలో ప్రవహిస్తూనే వుంది. నాలుగేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు మరో సంఘటన- మా ఇంట్లో గోడలకు అనేకమంది దేశనాయకుల, వీర తెలంగాణ నాయకుల పటాలుండేవి. ఎలావచ్చిందో ఒక పటంపైకి పాము వచ్చి తొంగి చూసిందట.

దాన్ని ఎలాగో చంపారు. చనిపోయిన పామును సరదాగా మా నాన్న నాకు చూపించాడు. అది ఇంకా పూర్తిగా చావలేదు, కదులుతూ వుంది. అంతే పరుగెత్తి మా అమ్మ ఒళ్లో దాక్కున్నాను. ఎంత భయపడ్డానంటే వెంటనే 103 డిగ్రీల జ్వరం వచ్చి కలవరింత మొదలైంది. ఏది చూసినా పామే అంటున్నాను. అప్పుడు మా నాన్న బట్ట పేలికతో ఒక పామును తయారు చేసి మళ్లీ నాకు చూపించి నా ముందే దానిపై కిరోసిన్ నూనె పోసి తగులపెట్టి బూడిద చేశాడు. అంతే నా జ్వరం తగ్గిపోయిందట. ఇది నాన్నతో నాకు తెలిసిన తొలి జ్ఞాపకం. నాకు 'అఆ'లు రాయడం చదవడం రాకన్న ముందే నన్ను ఒళ్లో కూచోపెట్టుకుని మంత్రపుష్పం నేర్పించినట్టు నాకు శ్రీశ్రీ మహాప్రస్థానం పద్యాలు మొత్తం నోటికి వచ్చేదాకా చెప్పడం నాకు బ్రహ్మాండంగా జ్ఞాపకం వుంది. మా నాన్న ఎత్తయిన మనిషి. నేను మా అమ్మలాగా పొట్టి. చిన్నప్పుడు మా నాన్నతో 'నాన్న నేను నీలాగ ఎత్తు ఎప్పుడవుతాను' అంటే 'మన ఇంట్లో పుస్తకాలన్ని చదివేస్తే నాకన్నా ఎత్తు అవుతావు పెద్ద పేరు తెచ్చుకుంటావు' అనేవాడు. నాన్న అంత ఎత్తు కాలేదు కానీ ఆ పుస్తకాలు నాన్న గ్రంథాలయంలోని పుస్తకాలు చదివాను. ఇంకెన్నో పుస్తకాలు చదవడం మాత్రం నాన్న మాటవల్లనే జరిగింది. సరె, ఎంత పేరు తెచ్చుకున్నాను అనేది వదిలేస్తే వచ్చిన పేరు ఈ మాత్రమైనా అది నాన్న, అమ్మ వల్లే అనుకుంటాను. నాలుగవ తరగతిలో నేనో పాట రాశాను.
ధగ ధగ మెరిసే జండా- వినవే పేదలగాధ- చల్లారదు ఆకలి బాధ- ఇంతే జ్ఞాపకం వుంది. ఈ పాట మా అమ్మకు వినిపించా. అమ్మ నాన్నకు చెప్పింది. నాన్న తన సహచరులైన గుర్రం యాదగిరిరెడ్డి, పడకంటి రామస్వామి, దూడ పుల్లయ్య, బత్తిని లక్ష్మీనర్సయ్య- వీళ్లందరిముందు నాతో ఆ పాట పాడించాడు. పాట కాగానే మా నాన్నతో పాటు అందరు కొట్టిన చప్పట్లు.. ఆ శబ్దం నేను ఇప్పటిదాకా మరిచిపోలేదు. అయితే ఈ పాట వినిపించిన తెల్లవారి ఒక విచిత్రం చేశాడు నాన్న. ఒక పెద్ద గిన్నె తెప్పించి ఒక చిన్న గ్లాసు ఇచ్చి ఈ గిన్నెను నీళ్లతో నింపమన్నాడు. నేను ఒక గ్లాసు నీళ్లు పోసి మళ్లీ నీళ్లకోసం వెళ్తుంటే వద్దు ఈ గ్లాసుతోనే ఒక్కసారికే గిన్నె నిండాలి అన్నాడు. అదెలా, వీలుకాదు అన్నాను. మరి ఈ గిన్నె నిండాలంటే ఎట్లా అన్నాడు. బోలెడన్ని నీళ్లు కావాలి అన్నాను. అప్పుడు నాన్న చాలా ప్రేమగా- మరి ఏ మాత్రం చదువుకోకుండా పాటలు రాస్తే జ్ఞానం సరిపోదుగా.

బాగా చదువుకొని పాటలు రాస్తే బాగుంటుంది అని నా పాట రాసేతనాన్ని పుస్తకాలు చదివే అలవాటుకు అద్భుతంగా మలిచి నా మేధస్సులోని గ్రంథాలయాల దండయాత్ర ప్రారంభించాడు. మా ఇంట్లో ఏ కొత్త పుస్తకం వచ్చినా సాయంకాలం అందర్ని కూచోపెట్టి ఒకరు చదివితే అందరూ వినేలా అలవాటు చేశాడు (ఈ పఠనాలలో పడకంటి రామస్వామి, యాదగిరిరెడ్డి వుంటుండేవాళ్లు). మా అమ్మ చదివేది. నేను చదివేది. ఎవరు చదివినా ఆ వాక్యాలలో అద్భుతవాక్యం రాగానే అందరూ ఆ వాక్యంలోని రసానుభూతి గురించి ఎంతో మెచ్చుకుంటూ విశ్లేషించేవారు. అది వినివిని చదివి చదివి ఇప్పటికీ ఒక్క రసాత్మక వాక్యం చదవగానే ఆ రచయితకు ఫోన్ చేయడం నాకు అలవాటయ్యింది.

ఇలా శరచ్చంద్ర, ఠాగూ ర్, చలం, శ్రీశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, నిన్నటి హేమలత, ముప్పాల రంగనాయకమ్మ, సి.నారాయణరెడ్డి.. ఒక్కరా ఇద్దరా.. కావ్యాలు, నవలలు, వ్యాసాలు చిన్ననాడే నన్ను తడిపి పునీతుణ్ని చేశాయి. మా ఊరికి ఏ పెద్దనాయకుడు, కళాకారుడు వచ్చినా మా ఇంట్లోనే భోజనం. అరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి, ధర్మభిక్షం, హరికథ భాగవతార్‌లు ఎవరితోనైనా మా నాన్నతో మాటామంతి జరుగుతున్నప్పు డు నన్ను దగ్గర కూచోబెట్టుకునేవాడు. నాకు తెలియకుండానే ఆ మాటలలోని ఫిలాసఫీ, అలంకారాలు, కవి త్వం, తార్కికం ఇలా ప్రాక్టికల్‌గా తెలుపకనే తెలిసేలా చేశాడు నాన్న. ఏంచేస్తే నాన్న రుణం తీరుతుంది.. నాకు ఇంతవరకు ఎన్ని లక్షలమంది ముందయినా మాటాడినా, పాడినా స్టేజ్‌ఫియర్ తెలియదు. కారణం నాకు ఊహ తెలియకన్నా ముందునుండే వేలాదిమంది ప్రజలముందు పాడించడం. నాకైనా చెల్లి భారతి కైనా తమ్ముళ్లకైనా స్టేజ్‌ఫియర్ తెలియదు.

దానికి కారణం మానాన్నే. ఇంటర్‌లో నేనున్నప్పుడు వేశ్యపైన పాట, మా ఊరి శకుని అంటూ ఒక గేయ కవిత రాశాను. నాన్న గొప్పగా వున్నాయని ప్రోత్సహించాడు. ఒక్కో పాటపైన ఒక్కో అభిప్రాయంపైనా రోజులకు రోజులు చర్చించేవాళ్లం. కట్కూరి రామచంద్రారెడ్డి చనిపోయినపుడు పాట రాయాల్సివస్తే మా అశోక్ రాస్తాడు అన్నాడు మా నాన్న. నేను రాశాను. ఆ పాట సంస్మరణసభలో వినిపించగానే హనుమంతూ నీ కొడుకును నీ అంత రచయితను చేశావని నాయకులు ప్రజలు మెచ్చుకుంటే మా నాన్న ఆ విషయం మా అమ్మకు ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు.

'పాట ఎలా రాయాలి' అనే చర్చ ఎన్నోసార్లు జరిగేది. మా నాన్న చర్చకు ఇచ్చిన ముక్తాయింపు ఇలా వుండేది- 'పల్లవి గెరిల్లా ముట్టడిలా అట్టాక్ చేసినట్టు వుండాలి. పల్లవిలో మొదటి వాక్యమే శ్రోతల దిమ్మదిరిగేలా వుండాలి. ఆ పాట ఇతివృత్తం ఏ రసానికి చెందిందో అందులోకి పాటలోని మొదటి వాక్యమే ఈడ్చుకు రావాలి. మనం వాడే ప్రతీకలు, ఉపమానాలు, ఉత్ప్రేక్షలు శ్రోతలను మన పాట ఆవరణలోకి తీసుకవచ్చి కట్టిపడేయాలి. అలాగే పాటలో మనం ఇచ్చే ముగింపు శ్రోతలను వెంటాడాలి. కొన్నిరోజులదాకా గుర్తుండేలా, ఎప్పటికీ గుర్తుకొచ్చేలా ఉండాలి.' నా గొప్ప పాటలన్ని నాన్న చెప్పినవిధంగా రాయబడ్డవే. పాట ఒక శతఘ్ని, వంద ఉపన్యాసాలకన్నా పాట బలమైంది అని పదేపదే చెప్పటంవల్లనే నేను పాటల రచయితను అయ్యానేమో.. 'మా భూమి' సినిమాలో నాన్న పాటను బి.నర్సింగరావు తీసుకున్నపుడు అది నాన్న పాట అని తెలియక అజ్ఞాత రచయిత అని సితార పత్రికలో వేశారు. అప్పుడు నేను ఆ పాట నాన్నదంటూ నర్సింగరావుకు ఒక లేఖ రాశాను. అతని నుండి నాకు జవాబు రాలేదు. నేను సుద్దాలకు వెళ్లి నాన్నకు చెప్పి మీ పేరు వచ్చేలా చేయాలి నాన్నా అన్నాను.
అపుడు మా నాన్న ఇలా అన్నారు- ఆ పాట నేను రాశానని నాకు తెలుసు. ప్రజలకు తెలుసు. తెలుగు సినిమాలో వెండితెరపై నా పేరు లేనంత మాత్రాన 'పాలబుగ్గల జీతగాడా!' పాట నాది కాకుండా పోతుందా? అన్నారు. చివరికి 'మా భూమి'లో నాన్న పేరు వేయడానికి మా అమ్మ ప్రోద్బలమే కారణం. మా నాన్నకో తీరని కోరిక- తన పాటలు అచ్చు రూపంలో చూసుకోవాలని నేను సంపాదనాపరుడినా.. అప్పటికింకా ఎదగకపోవడం వలన ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. పాట రచించే సమయంలో ఆ పాట ఏ ట్యూనులో రాయబోతున్నారో ఆ బాణీని సదా కూని రాగంగా పాడుకునేవాడు. పాటలోని కథావస్తువే మనకు బాణీని ఇస్తుంది అనడం నాకు బాగా గుర్తు. ఇప్పటికీ సినిమాలలో ట్యూన్ ఇవ్వకుండా నేను పాట రాయవలసివస్తే ఆ పాటలోని విషయమే నాకు కూడా బాణీ అందిస్తుంది. ఇది నాన్న అలవాటే నా అలవాటుగా మారింది.

నాన్న 75 ఏళ్ల వయసప్పుడు సుద్దాలలో మావూరి కె.వి.రంగారావు అనే దొరను ఓడించి సర్పంచ్‌గా గెలిచాడు. ఆ తర్వాత నాన్నకు క్యాన్సర్ వచ్చింది. డా.హబీబుల్లా చూసి చేయిదాటిపోయింది అశోక్. ఇంకో రెన్నెళ్ల కన్నా ఎక్కువగా బతకడు అని చెప్పారు. సుద్దాలకు వచ్చేశాం. ఆ గడచిన రెండు నెలలు మా ఇంట్లో ఎవరికీ మరపు రావు. నేను మా నాన్నను సరదాగా ఇలా అనేవాణ్ణి- 'నేను చచ్చిపోయాక ఎలా బతుకుతావు నాన్నా' అని. మా నాన్న ఆ మాటకు 'నేననాల్సిన మాట నువ్వంటావేంట్రా' అంటూ నవ్వేవాడు. నాన్నకు క్యాన్సర్ వచ్చి మంచంపై పడుకున్నపుడు- అప్పటికీ నాన్న మరణం సమయం అందరికీ తెలుసు- ఆ రోజు మా నాన్న ఏదో ఇంజక్షన్ చేయించుకోవడం మరచిపోతే నేను- 'ఇలా అయితే ఎలా నాన్న! నేను చనిపోయాక ఎలా బతుకుతావు' అన్నాను. అందరు ఏడ్చారు. నేను, నాన్న కూడా. ఆ రోజుల్లోనే నాకో ఆలోచన వచ్చింది- ప్రపంచంలో ఎంత మహానుభావుడికైనా చనిపోయాక కదా స్మ­ృతి గీతం రాస్తారు.

మావో, గాంధీ, లెనిన్, శ్రీశ్రీ ఎవరైనా తన స్మ­ృతి గీతం తను వినరు కదా, నాన్న స్మ­ృతి గీతం రాసి నాన్నకే వినిపిస్తే అనిపించింది. తప్పో-ఒప్పో నాకు తెలియదు. నేను మా నాన్న కనుమూయక ముందే నాన్న స్మ­ృతి గీతం రాశాను. నాన్నకి ఏడుస్తూ వినిపించాను. పాట వినిపించడం పూర్తయింది. నాన్న తప్ప ఇంట్లో అందరం ఏడుస్తు న్నాం. మా నాన్న రెండు చేతులు చాపి నన్ను పిలిచాడు. కౌగిలించుకున్నాడు.తన భుజంపై నా దు:ఖ బాష్పాలు.. నా భుజంపై నాన్న ఆనందబాష్పాలు.. నా వీపు నిమిరిన నాన్న చేతుల స్పర్శ.. భుజంపై నాన్న ఆనందబాష్పాల తడి ఇప్పటికీ ఆరిపోలేదు.. ఎప్పటికీ ఆరిపోదు.. ఆ తర్వాత మా అమ్మతో అన్నాడట. నీ కొడుకు నన్ను మించిన రచయితై పేరు తెచ్చుకుంటాడని.

బహుశా ప్రపంచంలో ఇలాంటి అనుభవం పొందిన కొడుకును నేనే మొదటివాణ్ణేమో అనుకుంటాను. ఆ తర్వాత మా నాన్న జీవితాన్ని నేను రాసి మా నాన్న చేత చదివిస్తూ మా చిన్నమ్మ కూతురు పద్మజ ఇచ్చిన టేప్ రికార్డర్లో నిక్షిప్తం చేశాను. అలాగే జయధీర్ తిరుమలరావు నాన్నచేత పాటలు రికార్డు చేయించారు. వారు నాన్న ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో చేశారు. నేను నాన్న జీవితాన్ని చివరి మూడు రోజుల ముందు చేశాను. ఇంకో రెండు రోజులలో మా నాన్నకు మాట ఆగిపోయి మరణిస్తాడనగా నేను మందుల కోసం హైద్రాబాదుకు వెళ్లాల్సివుండి పొద్దున్న 4 గంటలకు లేచి బయలుదేరబోతున్నాను.
నాన్న అన్నారు- 'నాన్న.. జాగ్రత్త! ఇంక అన్నీ నీవే చూస్కోవాలి. అమ్మ, తమ్ముళ్లు, చెల్లి..'
'నేను మళ్లీ వస్తాను నానా' అన్నాను. నవ్వాడు నాన్న. 'జాగ్రత్త' అన్నాడు అదే నాన్న చివరిమాట.. ఆ 'జాగ్రత్త' అనే మాట నన్ను జాగ్రత్త పరుస్తూనే వుంది. అన్ని వేళల్లో.. అన్ని మలుపుల్లో..!
-సుద్దాల అశోక్ తేజ
ఇది సుద్దాల హనుమంతు శతజయంతి సంవత్సరం

Monday, October 13, 2008

అనుమానపు చింత - పొన్నాల చంద్రశేఖర్


పొద్దుగాల్నే మా కడుప దొక్కినవ్ బిడ్డా

నీ కడుపు సల్లంగుండ

ఒక్క ఘడియ మా బత్కుల్ని సూత్తెనే

కండ్లల్ల నీల్లు పెట్టుకుంటివి

అరువైయేండ్ల గోస ఎట్టుంటదో ఎర్కైందా బిడ్డా

కడుపు కాలెటోళ్ల కతలన్ని ఒక్కటే నాయినా..

మాది జర్రంత ఎక్కువ బిడ్డా !

వచ్చెటోడు.. పోయెటోడు

నిక్కినోడు.. నీల్గినోడు

బద్మాష్ బడివెగాండ్లదే రాజ్జెమైపాయె..

ఇగురాలు తెల్వంగనే తెల్లారదు బిడ్డా..

ఇమానంగ పని చేస్తనని ఒట్టేయాలె

అవమానాలు.. పరాసికాలకు మా గడ్డ

పతా అయినందుకేమో నాయినా..

అనుమానం ఆకిట్ల సింత సెట్టాయె కొడుకా!

నీల్లు లేని బాయిల్ల కండ్లు కశికలాయె

సిరిసిల్లను జూసే సిన్నబుచ్చుకుంటివి

నల్గొండను జూసి తట్టుకుంటవా బిడ్డ?

ఒక్కో జిల్లది ఒక్కో గోస కాదు నాయినా

బొందల గడ్డలయితున్న బొగ్గు బాయిలు

కూలి కైకిలికి చీమల బారోలె

ఎలబారుతున్న పాలమూరు..

అటు కాటికి పోక.. ఇటు పేటకు రాక

కానల్ల కానెటోడు లేక

పురుగు పుట్రల కన్న అన్నేలమయితున్న

అడివి బిడ్డలొక దిక్కు..

మూతిమీన మీసమొత్తె సాలు

మాయమైతడో.. మాయజేత్తరో

ఏ గత్తరకు దేంట్ల తేలుతరోనని

దినాలు లెక్కపెట్టుకుంటున్న అవ్వయ్యలు..

బతుకు ప్లాస్టిక్ పూల బతుకమ్మాయె..

తంగెల్లకు బదులు జిల్లెళ్లు పూయబట్టె

వానరాక.. పానం పోక

చావు బత్కుల మధ్య డముకుల మోత

చెప్పుకుంటె మానం పోతది

చెప్పకుంటె పాణం పోతదన్నట్టు

నువ్వన్నట్టే ... !

ఇజ్జతున్నోళ్లం బిడ్డా..

కొట్లాడి.. కొట్లాడి యాష్టొత్తంది కొడుకా..

మేం గౌరవమిచ్చినోనికి పాణమిత్తం బిడ్డా

ఇగ నీ ఇట్టం..!

ఏం జేత్తవో.. ఎట్ల జేత్తవో

నియ్యతుంటేనే బర్కతుంటది బిడ్డా

ఇది అరువైయేండ్ల తండ్లాట

సావు బద్కుల అష్టచెమ్మాట

తప్పు చెయ్యకు బిడ్డా

తల్లి నోట శాపనార్థాలు తినకు

ఇమానంగ గీ గడ్డకు మేలు చేస్తె

మా కష్టాలన్నీ తీరుత్తె

నిన్ను కండ్లల్ల పెట్టుకుంటం బిడ్డా !

మా తెలంగాణంత పండుగ జేస్కున్న రోజు

దేవునింట్ల నీ బొమ్మ పెట్టుకుంటం కొడుకా!

లేకుంటె ......... ??!


(చిరంజీవి సిరిసిల్ల పర్యటనకు స్పందనగా..)


.

నేతన్నా ! ఆత్మహత్య చేసుకోకు..

మేము కవులము, రచయితలము, కళాకారులం. మీ బతుకు ఆయసా యాలను కథలుగా, కవితలుగా పాటలుగా రాసెటోళ్ళం. మీ కాళ్ళకు దండం పెట్టి వేడుకుంటున్నం. మీరస్సలే సావకుండ్రి. బతికి కొట్లాడుండ్రి. మీ యెంట మేమున్నం. మీ గుండె గాయాన్ని ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాన్క కైగట్టి ఇనిపిస్తం. నిన్ను అగ్గిల బొర్లిత్తున్నోళ్ళను జెండ కెక్కిత్తం. కూడులేక గూడులేక పుట్టెడు పుల్లెందలతో గుడ్డనిస్తున్న నువ్వు పాణంతో ఉండి కొట్లాడాలె గాని, సచ్చి సాధించేదేముంటది. నువ్వు ఒక్కరోజు సత్తవు సరే. నీ భార్యాపిల్లలు బతికినంత కాలం సావాల్సిందేనా. వాళ్ళకు నువ్వు లేని లోటు ఎవరు తీరుస్తరే!

నేతన్నా! అప్పు ఇయ్యల్ల గాకుంటే రేపు తీరుతది. పోయిన పాణం రాదు గదా! నీ సాంచ మూతవడి ఇల్లు గడవకపోవడానికి ఓ కుట్ర ఉంది. ముందు దాన్ని కనిపెట్టు. తర్వాత దాన్ని బద్దలుగొట్టు. ప్రభుత్వం మీద పోరాడు. నీ హక్కులు సాధించుకో. నువ్వు ఒంటరివి గాదు. నువ్వు నేసిన బట్టగట్టుకొని మానం గాపాడుకున్నోళ్లం. నీ పాణం గాపాడుతం. నీ తల్లికి బాగలేదు. పెండ్లికచ్చిన పిల్లలున్నరు. నీ సంపాదన అందుతలేదు. పొందుతలేదు. నీకు గూడా చాతనైతలేదు. ఉండవోతె ఇల్లు లేదు. పండవోతె తావు లేదు. ఇన్ని సమస్యలున్నయని బతుకు మీద విరక్తి తెచ్చుకోకు. పిరికివాళ్లు కష్టాలకు భయపడి పారిపోతరు. అష్టకష్టాలల్ల పుట్టినోనివి నీకు భయమెందుకే. రేపటికి రూపం లేదు. అయిందానికి అల్లరలేదు.

నువ్వు బయటకు రా! నీ కష్టాలను చెప్పుకో. ఒక పని గాకుంటే ఇంకోపని. ఈ ఊరు గాకుంటే ఇంకో ఊరు. అంతేగని నవ్వేటోళ్ల ముందట జారిపడ్డట్టు సచ్చుడెందుకే.. బతికి నిలవడాలెగని! కట్టం తెలిసినోనివి. కట్టపడే గుణం ఉన్నోనివి. మిద్దెలు మేడలు అడుగుతలెవ్వు. కడుపుకు తిండి వెట్టుమంటున్నవు. కష్టం చేస్తనంటున్నవు. నీ వెనుక మేమున్నం. నీతో కలిసి పోరాడుతం.. బెంగటిల్లకు. గుండె చెదరకు. నువ్వు ఆగంగాకు. నిను గన్నోళ్ళను, నువ్వు గన్నోళ్ళను ఆగం చేయకు. నిలవడు. బతుకుతో కలెవడు

- తెలంగాణ రచయితల వేదిక (సిరిసిల్లలో నేతన్నల సంఘీభావర్యాలీలో విడుదల చేసిన కరపత్రం నుంచి)

Tuesday, October 07, 2008

నేత కళాకారుడు


నేతగాడు ఊరుండీ పేరులేనివాడు

నేత కాలేనివాడు

ఉత్తి కూలిజీతగాడు

లోకం పోకడ తెలీని

మగ్గం గోతిలోని చిరుకప్ప

నిలువుగా అడ్డంగా కదిలే

ఆ కాళ్లూ చేతులూ క్రాంకుషాఫ్టులు

మగ్గంగోతిలో లయబద్దంగా

పావలపై కదిలే ఆ కాళ్లు

రంగస్థలిపై నటరాజ పదయుగళీ

చటుల ప్రవృత్త నర్తన లీక్షించే

మా కళ్లకు కానరావు

వాటికి నోరులేదు

ఘల్లుఘల్లు మని వాగడానికి

నేస్తున్నప్పుడు ఎగిరే అతడి పక్కలు

అమృతాపహరణ వేళ గరుత్మంతుని రెక్కలు

నాడి విసురుతున్నప్పుడు కదిలే చేతులు

నాట్య మోహినీ ముద్రాంకితాలు

తనువంతా నర్తిస్తూనే వుంటుంది

అతడి ప్రతి అంగ విన్యాసం

ఒక కొత్త సృష్టి

అతని చేతిలో

యంత్రాలు కాపీ కొట్టలేని కళా సృష్టి

అతడు నేత కళాకారుడు

ఇన్నాళ్ల మానవ చరిత్రలో

ఒక్క నేతగాడి పేరైనా వినిపించిందా?

ఒక్క కంచు పతకమైనా గెలిచిన రుజువుందా?

నంది కాదు గంగిరెద్దునైనా యిచ్చారా?

బట్టను ఉత్పత్తి చేసే ఉత్తి కార్మికుడిగానే చూశారు

అపురూపమైన డిజైన్ల

జరీ అంచుల చీరలు

ఎగ్జిబిషన్ స్టాల్సులో రెపరెపలాడుతూ..

ప్రక్కనే అతడు నిలబడ్డా

నేసిందెవరని ఒక్కరుగూడ అడగరు

ఏ వూరి నేతని అడుగుతారు అతడినే

ఊరుండీ పేరులేని చేనేత కార్మికుడా !

కుంచ పట్టుకున్నా

తైలవర్ణ చిత్రం కింద పేరు రాసుకోవచ్చు

ఆపాత మధురంగా పాడు- పేరు మోగుతుంది

కవిత్వం రాసినా

పుస్తకంమీద పేరైనా వుంటుంది

నేతగాడా! నువ్వు కళాకారుడివే

గొప్ప గొప్ప కళాకారులంతా

అనుభవించే దరిద్రం దుఃఖం

నువ్వూ అనుభవిస్తున్నావు !


-డా. అల్లంసెట్టి

Wednesday, October 01, 2008

ముంబాయి హైదరాబాదులకు పోలికా..? -నవీన్ ఆచారి


29 సెప్టెంబరు 2008 నాటి వార్త దినపత్రిక సంపాదక పేజీ లోని తుర్లపాటి కుటుంబరావు గారి వ్యాసానికి స్పందనగా ఇది రాస్తున్నాను. ముంబయి లో జరుగుతున్న సంఘటనల్ని ఏకరువు పెట్టిన రచయిత హైదరాబాదు ను దానితో పోల్చే ప్రయత్నం చేశారు. (వారి వ్యాసాన్ని ఇక్కడ జతపరుస్తున్నాను.)

రెండొదశ తెలంగాణ ఉద్యమం మొదలైన దగ్గర్నించి లక్షలాది మందితో సభలు సమావేశాలు హైదరాబాదులో అనేకం జరిగాయి. ఐతే వీటిలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. నిజంగా తెలంగాణ ఉద్యమానికి ముంబయి లో జరిగేదానికి పోలికలు ఉండి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. సినీ హీరోల అభిమానులే రోడ్ల మీద భాహాభాహికి దిగుతున్న సందర్భాలున్నాయి. ఓక ప్రభంజనం లాంటి ఉద్యమాల్లో కూడా ఈ ఎనిమిదేళ్లలో ఎక్కడా కనీసం ఒక చిన్న హింసాత్మక సంఘటన ఐనా జరుగక పోవడం నిజంగా తెలంగాణ ఉద్యమం ఎంత బలమైన సామజిక, రాజకీయ, ఆర్థిక కారణాలతో ఏర్పడ్డదో తెలియజేస్తుంది. హైదరాబాదులో తెలంగాణ ప్రజలు మాత్రమే ఉండాలని తెలంగాణ ఉద్యమం చెప్పలేదు. తెలంగాణ ఉద్యమకార్యకర్తల ఉద్దేశ్యం కూడా ఇది కాదు. ఎంతో మంది సమైక్యవాదులు, ఆంధ్రా ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు హైదరాభాదు లో ఉన్నప్పటికీ వారిపట్ల ఎప్పుడూ ఎవరూ అమర్యాదగా ప్రవర్తించకపోవడాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. లక్షలాది మంది ఆంధ్రా సోదరులు తెలంగాణ ప్రాంతం లో తెలంగాణ వారితో కలిసిమెలిసి ఉంటున్నారు. ఎప్పుడూ ఎక్కడైనా ఎవరిపైనైనా దాడులు గానీ జరగలేదే. లగడపాటి వంటి ప్రజాప్రథినిది పదే పదే దమ్ముంటే రండి అని సవాళ్లు మానుకుని విషయాన్ని పరిష్కారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యాలే కాని సవాళ్లతోనే సమధానాలు దొరుకుతాయనుకున్నాడు కాబట్టే ఇటు తెరాస వారు కూడా అంతే దీటుగా స్పందించారు. ఈ చాలెంజ్ లను మొదలు పెట్టింది లగడపాటి రాజగోపాల్ గారేనన్నది ఎవరికీ తెలియనిది కాదు. తాను నిజామాబాదులోనే ఉన్నా దమ్ముంటే రమ్మన్న లగడపాటిని హైదరాబాదు లో అడుగుపెట్టనివ్వమన్నారు తెరాస వారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణమం కానప్పటికి సహజమైన ప్రతిస్పందనే.

నిజామాబాద్ సంఘటన హైదరాబాదు కు చేరడం కొత్తేమి కాదు. ఇలా రాష్ట్రం లో జరిగిన సంఘటనలు రాజధానికి చేరిన సంధర్బాలు కోకొల్లలు. మొదటి ఎస్సార్సీ సమైక్య రాష్ట్రానికి అనుకూలం అని తప్పుడు ప్రచారంచేసే లగడపాటి ని గాంధేయవాది అనడాన్ని కుటుంబరావుగారు పునరాలోచించాలి.

నిజామాబాదు లో ఎంపీ కారు తెలంగాణ ఉద్యమకారుల పైకి దుసుకువెళ్లిందని ఆనాటి కొన్ని పేపర్లలో వచ్చింది. కొన్ని పేపర్లలో దానికి దగ్గరగా ఉన్న ఫొటో లు కూడా ప్రచురించబడ్డాయి. ఐతే కొన్ని పత్రికలను మినహాయిస్తే చాలా వరకు మీడియా ఏదినిజం అన్నదాని పట్ల మౌనంగానే ఉంది. లగడపాటి కారు తనది కాదు అంటున్నాడు. అది లగడపాటి కారే అంటున్నాడు గాయపడ్డ చిన్నారెడ్డి. ఐతే ఎవరిని నమ్మాలి అన్న విషయం పక్కనపెడితే అది లగడపాటి వాహనం కాదు అని ఏ ఒక్క పత్రిక కూడా రాయకపోవడం గమనార్హం. కుటుంబరావు గారు చెపినట్టు ఆ సంఘటన జరుగగానే పోలీసులు కేసుపెట్టి సదరు డ్రైవర్ని అరెస్టుచేసి ఉంటే విషయం ఇక్కడివరకూ వచ్చేదీ కాదు. అది లగడపాటి కారు కాకపోతే కాన్వాయ్ లోని ఏ వాహనమో పోలీసులు చెప్పాలికాదా. ఎందుకు చెప్పరు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ పోలీసులున్నారు. ఇదంతా రహస్యం కాదు. టీవీల్లో మనం ప్రత్యక్షంగా చూశాం. పోలీసుల మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో విజ్ఞులైన ప్రజలకు తెలుసు.

ఇదంతా టీవీల ద్వారా చూసిన లక్షలాదిమందిలో ఓ పది పదిహేను మంది యువకులు ల్యాంకో ఆఫీసు అద్దాలు పగులగొట్టారు. ఇది అవాంఛనీయమే. దాంట్లొ సంశయం లేదు. ఐతే దాని నేపథ్యాన్ని, దానికి దారితీసిన సంఘటనలను మరిచి కేవలం ఈ ఘటననే భూతద్దం లోంచి చూడడం సరి కాదు. నిజామాబాదు లో మొహం చాటేసిన పోలీసులు హైదరాబదులో ల్యాంకో అద్దలు పగిలితే మాత్రం ఆఘమేఘాల మీద కదిలి వచ్చారు. ఎవరూ తప్పించుకోలేరని, అరెస్ట్ చేస్తామని మీడియా ముందు ప్రకటించి చెప్పినట్టుగానే ల్యాంకో అద్దాలు పగులగొట్టిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఐతే దీనికి మూల కారణమైన నిజామాబాదు లో మాత్రం ఎలాంటి డ్రైవరును అరెస్టు చేయలేదు. వాహనం సీజూ కాలేదు. హైదరాబాదు లో ల్యాంకో పై దాడిని అడ్డుకోవడం లో విఫలమయ్యారని సంబందిత పోలీసు అధికారిని బదిలీ చేయడం ఈ సంఘటనకో కొసమెరుపు. ఇదండీ ప్రజాస్వామ్యం.

ప్రజల భాగస్వామ్యంతోనే 'సిరి'సిల్ల


అత్యాధునిక జౌళి కేంద్రంగా రూపొందడానికి అవసరమైన సహజ, మానవ వనరులు సిరిసిల్లలో పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులందరూ ఏకీభవిస్తున్నారు. ఇది ఆచరణలోకి రావాలంటే రెండు సవాళ్ళను మనం అధిగమించవలసివుంటుంది. ఒకటి- ప్రజల భాగస్వామ్యంతో ఆ వనరులను అభివృద్ధి చేయడం; రెండోది ప్రజలే యజమానులుగా ఉండే సమ్మిళిత అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించడం.


నేత మగ్గాలు యుముని మహిషపు లోహ ఘంటల ను విన్పిస్తున్నాయి! సరళీకృత ఆర్థిక విధానాల ఫలితమిది. నేత పరిశ్రమకు పేరుగాంచిన సిరిసిల్ల లో వందలాది నేత కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. రెండు రోజుల క్రితం ముగ్గురు నేత కార్మికుల ఆత్మహత్యల తో ఆ ఊరిలో 1997 నుంచి చోటుచేసుకొన్న ఈ విషాద మరణాల సంఖ్య 500కి మించిపోయింది. 'ధరలు పెరిగిపోతోన్నాయి. మా జీతాలేమో గొర్రె తోక బెత్తెడుగా ఉండిపోయాయి. రోజుకు 12 గంటలు పనిచేస్తాము. నేసిన బట్ట ను బట్టి రోజుకు 80 నుంచి 100 రూపాయలు మాత్రమే ఇస్తారు. అనారోగ్యంతో పనికి వెళ్ళకపోతే పైసా కూడా ఇవ్వరని' ఆర్. శంకర్ అనే మరమగ్గం కార్మికుడు వాపోయాడు. 'తమిళనాడు, మహారాష్ట్రలలో జెట్, ఆటో మగ్గాలు వచ్చిన తరువాత సిరిసిల్లలో చేనేత కార్మికులకు సమస్యలు పెరిగిపోయాయి.
కనీస అవసరాలు తీర్చుకోవడానికి అవసరమయిన ఆదాయం కూడా కరువయిందని' అతను పేర్కొన్నా డు. సామల మల్లేశం (నేత కార్మికుల సంఘం నాయకుడు) ఇలా ఆరోపించారు: 'నేత కార్మికులు అసంఘటితరంగం లో ఉన్నందున వారికి కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదు. పి.ఎఫ్, ఆరోగ్య బీమా మొదలైన సదుపాయాల గురించి అసలు మాట్లాడనక్కర లేదు. మగ్గాల యజమానులు నేతన్నలను బానిసలుగా పని చేయించుకొంటూ బాగా దోపిడీ చేస్తున్నారు'. హైదరాబాద్‌లోని 50 మంది వ్యాపారస్తులు రాష్ట్రంలోని చేనేత వస్త్రాల వ్యాపారంపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యాపారులు మాస్టర్ వీవర్స్‌కు ఆర్డర్స్ ఇస్తారు. మాస్టర్ వీవర్స్ ఆ మేరకు నేత కార్మికులకు పని కల్పిస్తారు. నేటి చేనేత కుటుంబాల జీవిత వాస్తవమిది. మరి దశాబ్దాలుగా చేనేత కార్మికుల బతుకులు అంతులేని విషాదంతో కృంగిపోతున్నాయంటే ఆశ్చర్యమేముంది? సిరిసిల్ల నేత కార్మికులకు ఆశావహమైన భవిష్యత్తు లేదా? 'ఇందిరమ్మ రాజ్యం' స్థాపించడానికి కంకణం కట్టుకున్న పాలకులు ఈ బక్క జీవుల సంక్షేమం లక్ష్యంగా అభివృద్ధి విధానాలు రూపొందించి అమలుపరచేదెన్నడు? చేనేత రంగంలో సంక్షోభానికి మూడు ప్రధాన కారణా లు ఉన్నాయి.


(అ) కేంద్ర ప్రభుత్వం 1991లో ప్రవేశపెట్టిన సరళీకృత విధానం. దీనివలన నూలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నూలుపై 9.25 శాతం ఎక్సైజ్ పన్ను విధించడంతో ఆ ధరలు మరింతగా పెరిగిపోయాయి. దీని కి తోడు పత్తి ఎగుమతులుపెరిగాయి. ఐదు కిలోల నూలు ధర 300 నుంచి 600 రూపాయలకు పెరిగిపోయింది. ఈ పెరుగుదల చేనేత పరిశ్రమలోని అన్ని వర్గాల వారిని ప్రతికూలంగా ప్రభావితం చేసింది. జీవనోపాధిని రక్షించే లక్ష్యా న్ని పాలకులు త్యజించారు. పరిశ్రమను పూర్తిగా విపణి శక్తు ల బారిన పడవేశారు. గోరుచుట్టుపై రోకటి పోటులా ప్రపంచీకరణ విధానాలు వచ్చి పడ్డాయి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కింద దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేయడంతో చైనా, థాయిలాండ్ నుంచి చౌక వస్త్రోత్పత్తులు దేశం లోకి వెల్లు వెత్తాయి. దీంతో చేనేత పరిశ్రమ కుదేలైపోయింది. (ఆ) చిన్న తరహా పరిశ్రమల రంగం నుంచి మర మగ్గాలను తొలగించడం. కేంద్ర ప్రభుత్వ సరళీకృత విధానాల క్రింద ఎవరైనా మర మగ్గాలను ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది. దీంతో రిలయన్స్, మఫత్‌లాల్ మొదలైన పారిశ్రామిక సంస్థలు కూడా జెట్, ఆటో మగ్గాలతో ఈ రంగంలోకి ప్రవేశించాయి. సెకండ్ హ్యాండ్ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు.

అధునాతన మర మగ్గాలపై దిగుమతి సుంకాల లో రాయితీ కల్పించారు. సాంకేతికత నవీకరణ నిధి పథకం కింద వాటిని దిగుమతి చేసుకోవడానికి 50 శాతం ఆర్థిక సహాయం కూడా కల్పించారు. ఈ అధునాతన మగ్గాలతో పాటు ఆధునిక ఉత్పత్తి ప్రక్రియలను కూడా పారిశ్రామిక వేత్తలు అవలంబించారు. దీంతో అప్పటివరకు మన దేశంలో ఉపయోగిస్తున్న మర మగ్గాలు మూల న పడే పరిస్థితి ఏర్పడింది. (ఇ) విద్యుత్ చార్జీలు, ఎక్సైజ్ సుంకాలు, రసాయనాలు, రంగుల ధరలు పెరగడం. ఈ పరిణామం చేనేత పరిశ్రమ నడ్డి విరిచేసింది. సిరిసిల్ల చేనేత కుటుంబాలు ఈ పరిస్థితిని తట్టుకోలేక పోయాయి. 2001 నాటికి సంక్షోభం మరింత తీవ్రమయింది. లాభాలు పూజ్యం కావడంతో 70 శాతం చిన్నతరహా, మధ్య తరహా సంస్థలు మూతపడ్డా యి. వేలాది నేతన్నలకు జీవనోపాధి కరువయింది. ఆకలి మరణాలు పెరిగిపోయాయి. పలువురికి ఆత్మహత్యలే గత్యంతరమయ్యాయి. ఈ దయనీయ పరిస్థితులకు ఎక్కువగా బలయింది మహిళలే.

వారిలో బండి కనకవ్వలు ఎందరో? (ఈమె విషాదగాథపై గత మే 9న 'ఆంధ్రజ్యోతి' లో ఒక వార్తా కథనం వెలువడింది). చేనేత కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టకపోలేదు. చిన్న తరహా, మధ్యతరహా సంస్థలను ఆదుకోవడానికి విద్యుత్ చార్జీలపై 50 శాతం సబ్సిడీని ప్రకటించింది. అయితే ఇది ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. విద్యుత్ సబ్సిడీ సాకు చూపి వ్యాపారులు చేనేత ఉత్పత్తులను తక్కువ ధరకు కొన్నారు. అంతేకాక బట్ట కొనుగోలు ధరను మీటరుకు 10 పైసలు చొప్పున తగ్గించారు. (ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మీటరుకు 7 పైసలు మాత్ర మే). సిరిసిల్ల వద్ద టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్ర ఫ్రభుత్వం తీసుకొన్న మరో ముఖ్యమైన చర్య. 500 మీటర్ల బట్టను ఉత్పత్తి చేయగల హై స్పీడ్ మర మగ్గాల యూనిట్లను ఈ టెక్స్‌టైల్ పార్క్‌ల్లో ఏర్పాటు చేయవలసివుంటుంది. ఇందుకు 25 లక్షల రూపాయల పెట్టుబడి అవసరం. ఇంత స్థోమతకలవారు సిరిసిల్ల చేనేతన్నలలో ఎవరూ లేరు. 2001 సంవత్సరం తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలేవీ సిరిసిల్ల నేత కార్మికుల ను సమస్యల నుంచి బయటపడ వేయలేకపోయాయి.

ఈ నేపథ్యంలో సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవడానికి విధాన నిర్ణేతలు చేయవలసినదేమిటి? ప్రజలకు ప్రాధాన్యమిచ్చే అభివృద్ధి నమూనాను అనుసరించడమే. ఈ విషయమై నా అభిప్రాయాలను నివేదిస్తున్నాను. అత్యాధునిక జౌళి కేంద్రంగా రూపొందడానికి అవసరమైన సహజ, మానవ వనరులు సిరిసిల్లలో పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులందరూ ఏకీభవిస్తున్నారు. ఇది ఆచరణలోకి రావాలంటే రెండు సవాళ్ళను మనం అధిగమించవలసివుంటుంది. ఒకటి- ప్రజల భాగస్వామ్యం తో ఆ వనరులను అభివృద్ధి చేయడం; రెండోది ప్రజలే యజమానులుగా ఉండే సమ్మిళిత అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించడం. ఐదు అంశాలతో కూడిన సమగ్ర అభివృద్ధి పథకాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. దాన్ని అమ లు పరిస్తే ఆ రెండు లక్ష్యాలను సాధించడం కష్టతరమేమీ కాదని నేను భావిస్తున్నాను. సిరిసిల్లను అత్యాధునిక జౌళి కేంద్రంగా రూపొందించడానికి తోడ్పడే ఆ పథకంలోని ఆ ఐదు అంశాలను క్లుప్తంగా వివరిస్తాను. (అ) 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో సిరిసిల్ల పట్టణాన్ని 'చిన్న తరహా జౌళి ప్రత్యేక ఆర్థిక మండలం'గా ప్రకటించుట: ప్రజలే యజమానులుగా ఉండే సంస్థలను ప్రోత్సహించడానికి, ఉత్పత్తులను పూర్తిగా కొనుగోలుచేసే హమీతో ఈ చిన్న తరహా జౌళి సెజ్‌ను ఏర్పాటు చేయాలి.

ఈ సెజ్‌లో జరిగే ఆర్థిక కార్యకలాపాలన్నిటిలో ప్రభుత్వం 50 శాతం పెట్టుబడి పెట్టాలి. ప్రాథమిక ఉత్పత్తే ఈ సెజ్ కార్యకలాపాలకు లక్ష్యంగా ఉండాలి. కొత్త ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలి. జౌళి కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు దీర్ఘకాలంలో ఈ పట్టణం లో సేవల రంగం కూడా అభివృద్ధి చెందేలా పథకాలను రూపొందించాలి. అధునాతన మగ్గాలపై పనిచేసేందు కు కార్మికులకు అవసరమైన శిక్షణ సదుపాయాలను కల్పించాలి. ఇటువంటి చర్యలను చేపట్టినప్పుడు సిరిసిల్ల 2020 సంవత్సరం నాటికి తక్కువ విలువ కలిగిన పెటీకోట్‌ల తయారీ జౌళి కేంద్రం స్థాయినుంచి పూర్తి స్థాయి 'జౌళి రాజధాని'గా అభివృద్ధి చెందగలదు. (ఆ) సెస్‌ను ఆదర్శంగా తీసుకొని స్వావలంబన నేర్చుకోవడం: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) మన దేశంలోనే కాక వర్ధమాన దేశాలన్నిటా గత నలభై సంవత్సరాలుగా ఒక విజయవంతమైన సహకార సంఘంగా వెలుగొందుతోంది. ప్రస్తుత సిరిసిల్ల శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు 1960 దశకంలో ఈ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా పనిచేస్తో న్న సంస్థలకు సెస్ ఒక చక్కని తార్కాణం. ఈ ప్రపంచీకర ణ యుగంలో కూడా అది విజయవంతమైన సహకార సంఘంగా ఉండటం గమనార్హం. విద్యుత్ సరఫరాలో సెస్ సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవససరమెంతైనా ఉంది.

సిరిసిల్ల జౌళి సెజ్‌కు అవసరమయ్యే విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు సెస్ ఆధ్వర్యంలో ఒక విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. (ఇ) సిరిసిల్ల సెజ్ ప్రమోషన్ కౌన్సిల్: సిరిసిల్లను అత్యాధనిక జౌళి కేంద్రంగా రూపొందించడానికి సిరిసిల్ల సెజ్ ప్రమోషన్ కౌన్సిల్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధు లు ఇందులో సభ్యులుగా ఉండాలి. ఈ కౌన్సిల్‌కు నిర్దిష్ట అధికారాలు కల్పించాలి. కీలక నిర్ణయాలు తీసుకొనే అధికారం కూడా సభ్యులకు ఉండాలి. (ఈ) మహిళా ఉపాధి మిషన్: మహిళల సాంప్రదాయక కౌశాలాలను పూర్తిగా వినియోగించుకోవాలి తద్వారా వారి ఆదాయ మార్గాలను మెరుగుపరచాలి. మహిళల పరిస్థితులను మెరుగుపర్చడం ద్వారా సిరిసిల్లలో సామాజిక, ఆర్థిక మార్పులను సమష్టిగా సాధించాలి.

ఈ లక్ష్యాలను సాధించడానికి స్వతంత్ర అధికారాలతో కూడిన మహిళా ఉపాధి మిషన్ నొకదాన్ని నెలకొల్పాలి. సెజ్ ప్రమోషన్ కౌన్సిల్‌కు మాదిరిగానే దీనికి కూడా స్పష్టమైన అధికారాలు, హక్కులు, విధులు నిర్దేశించాలి. (ఉ) మానవ వనరుల అభివృద్ధికి ఒక సమగ్ర పథకా న్ని రూపొందించి అమలుపరచాలి. అభివృద్ధి, సామాజిక న్యాయం పరస్పరం విరుద్ధమైనవికావు. సామాజికన్యాయం కొరవడిన అభివృద్ధి సుస్థిరమైనదికాదు. ఈ సత్యాన్ని విసమించడం వలనే ఆర్థిక సంస్కఱనలు సామన్యాల సంక్షేమానిక విఘాతంగా పరిణమించాయి. ప్రత్యామ్నాయ అభివ ఋద్ధి నమూనాలను అనుసరించాల్సిన అవసరమెంతైనా ఉంది. సిరిసిల్లను అత్యాధునిక జౌళి కేంద్రంగా రూపొందించడానికి నేను ప్రతిపాదించిన పథకం ఆ అవసరాన్ని తీర్చగలదని విశ్విసిస్తున్నాను.

-రమేష్ చెన్నమనేని
(వ్యాసకర్త హంబోల్ట్ విశ్వవిద్యాలయం (జర్మనీ)లో ఆచార్యులు)